ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాల కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించడంతో, విజయవాడ జైలు అధికారులు ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వయసు పైబడటం వల్ల ఇటీవల కాలంలో ఆయన తరచూ బీపీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని జైలు వర్గాలు తెలిపాయి. వారం రోజుల క్రితమే ఆయనకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా శనివారం మళ్లీ అదే సమస్య తలెత్తడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు వైద్యుల పరిశీలనలో ఉంచి, అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం.పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో రెండు రోజుల క్రితమే హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు.ఇదిలా ఉండగా, నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చేసుకున్న విజ్ఞప్తి మేరకు, వైద్య చికిత్స నిమిత్తం న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, పోలీసులు వంశీని విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన రెండు మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతారని, ఆ తర్వాత తిరిగి జిల్లా జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa