ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెప్పపాటులో..ఘోరం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 07:48 PM

కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం.. రెప్పపాటు జీవితం.. ఏ మహానుభావుడు ఈ మాట చెప్పాడో కానీ.. అక్షర సత్యం. ఉదయం తెల్లారి నిద్ర లేచింది మొదలు.. రాత్రి తిరిగి పడుకునే వరకూ.. ఎలాంటి వారంటీ, గ్యారంటీ లేనిదే లైఫ్. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. అనివార్యమైన ఈ విషయం కోసం శోకింపవలదంటూ గీతలో కృష్ణుడు చెప్పాడని సరిపెట్టుకుందామనుకున్నా.. అప్పడప్పుడు జరిగే కొన్ని ఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికావడం ఖాయం. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చూసిన నెటిజనం.. ప్రమాదం ఏవైపు నుంచి ఎప్పుడు, ఎలా దూసుకువస్తుందో తెలియదని కామెంట్లు పెడుతున్నారు.


విధి.. అది మన జీవితాన్ని ఎప్పుడు, ఎలాంటి మలుపు తిప్పుతుందనేదీ ఆ విధాత తప్ప, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టలేదు. అలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో చేసుకుంది.రోడ్డు మీద వెళ్లే సమయంలో ప్రమాదం ఏవైపు నుంచి అయినా ముంచుకురావొచ్చని, అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన సూచిస్తోంది. రహదారి మీద వెళ్లే సమయంలో మనకు రూల్స్ ప్రకారం, బాగానే డ్రైవింగ్ చేస్తున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని నడుపుతున్నారో చెప్పలేమని ఈ ఘటన రుజువుచేస్తోంది.


నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నందికొట్కూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జూపాడు బంగ్లా నుంచి కర్నూలు వైపు వెళ్తున్న టిప్పర్.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో.. రోడ్డు డివైడర్ దాటి అటువైపుగా వస్తున్న బైక్ మీదకు దూసుకెళ్లింది. ఆ బైక్‌ను అలాగే రోడ్డు పక్కన గోతిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులను వెలుగోడు మండలం అబ్దుల్లాపురానికి చెందిన రెహమాన్​, ఎల్లాగౌడ్‌గా గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.


ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో టిప్పర్‌ను గోతిలో నుంచి బయటకు తీశారు. గాయపడిన ఇద్దరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లు కూడా కారణం కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.


 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనం ప్రమాదం ఎప్పుడు. ఎలాగైనా ముంచుకు రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa