ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రక్కుల్లో డ్రోన్లు తరలించి.. రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్

international |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 10:32 PM

ఉక్రెయిన్ రక్షణ బలగాలు చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన దాడి చేశాయి. "స్పైడర్ వెబ్" కోడ్ పేరుతో రష్యాలోని ఐదు కీలక వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో Tu-95MS, Tu-22 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు A-50 రాడార్ విమానాలు ధ్వంసమయ్యాయి. తమ దాడిలో రష్యాకు చెందిన మొత్తం 41 విమానాలు ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఈ దాడిని రష్యా కూడా ధ్రువీకరించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముర్మాన్‌స్క్, ఇర్కుట్‌స్క్, ఇవానోవో, ర్యజాన్, అమూర్ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు టార్గెట్ అయ్యాయి. అయితే, ఇవానోవో, ర్యజాన్, అమూర్ ప్రాంతాల్లోని దాడులను తిప్పికొట్టినట్టు మాస్కో తెలిపింది. ‘కొన్ని విమానాలు అగ్నికి ఆహుతయ్యాయి.. మిగిలిన వాటిని రక్షించాం’ అని రష్యా పేర్కొంది.


18 నెలల కిందటే స్కెచ్


ఈ దాడులకు సంబంధించిన ప్రణాళిక దాదాపు 18 నెలలుగా సాగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. ‘ఇది మా అత్యంత దూరదృష్టి ఆపరేషన్.. 117 డ్రోన్లతో విజయవంతంగా జరిపిన దాడి ఇది. ఇందులో వ్యూహాత్మక క్రూయిజ్ మిసైల్ క్యారియర్లలో 34% ను తాకగలిగాం’ అని పేర్కొన్నారు. SBU సమాచారం ప్రకారం.. డ్రోన్లు ముందే రష్యా లోపలికి అక్రమంగా తరలించారు. ట్రక్కుల్లో ఏర్పాటు చేసిన చెక్కపెట్టెల్లో వీటిని దాచిపెట్టారు. దాడి సమయంలో ఈ పైకప్పులను రిమోట్ ద్వారా తెరచి, డ్రోన్లను టార్గెట్లపైకి పంపారు.


తమ దాడిలో 7 బిలియన్ల విలువైన వ్యూహాత్మక విమానాలను రష్యా కోల్పోయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే దీనిని ఇప్పటివరకు రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, మాస్కో పరోక్షంగా కొన్ని విమానాలపై మంటల్లో కాలిబూడిదయ్యాయని, కొన్ని డ్రోన్లు సైనిక స్థావరాల సమీపం నుంచి ప్రయాణించినట్లు వెల్లడించింది. డ్రోన్లను ప్రయోగించిన ట్రక్కుల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలిపింది. కాల్పుల విరమణ కోసం రష్యా, ఉక్రెయిన్‌లను ట్రంప్ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దాడి జరగడం గమనార్హం.


ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 4,300 కిలోమీటర్ల దూరంలో ఉండే బెలాయా ఎయిర్‌బేస్ (ఇర్కుట్‌స్క్), ఉత్తర సరిహద్దుల నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓలెన్యా ఎయిర్‌బేస్ (ముర్మాన్స్‌క్) స్థావరాల్లో తీవ్రమైన నష్టం జరిగినట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. దాడి అనంతరం మంటలు చెలరేగి, విమానాలు కాలిపోతూ పొగలు ఎగిసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.


మూడేళ్ల యుద్ధంలో ఉక్రెయిన్ కీలక దశలోకి అడుగుపెట్టిన సమయంలోనే ఈ దాడి చోటుచేసుకుంది. శాంతి చర్చల్లో రష్యాను దారితెచ్చుకునే ప్రయత్నంలోనే భాగంగానే ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. కాగా, జూన్ 3న ఇస్తాంబుల్‌లో రష్యాతో చర్చల కోసం తమ రక్షణ మంత్రి ఉమెరోవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa