ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎంకే ఎంపీ కనిమొళి సమాధానానికి స్పెయిన్‌లో చప్పట్ల వర్షం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 07:25 PM

అఖిలపక్ష దౌత్య బృందానికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే ఎంపీ కనిమొళి ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు. ముఖ్యంగా అపరేషన్ సిందూర్, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ప్రపంచానికి తెలియజేసేందుకు ఇటీవలే కొందరు ఎంపీల బృందాలు పలు దేశాలకు వెళ్లారు. అలా స్పెయిన్ వెళ్లిన కనిమొళికి అక్కడే ఓ వింత ప్రశ్న ఎదురైంది. ముఖ్యంగా తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ భాషా వివాదం కొనసాగుతుండగా.. భారత దేశ జాతీయ భాష ఏదంటూ ఓ వ్యక్తి అడిగాడు. దీనికి కనిమొళి తడుముకోకుండా ఓ సమాధానం చెప్పగా.. అక్కడి ప్రజలంతా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ముఖ్యంగా ఆ వివాదం గురించి ఏమాత్రం మాట్లాడకుండా తన మనసులోని భావాన్ని సూటిగా వెల్లడించారు. మరి ఆమె చెప్పిన సమాధానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం త్రిభాషా విద్యావిధానాన్ని తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అంతా హిందీ, ఇంగ్లీషు సహా ఓ స్థానిక భాషను నేర్చుకోవాలని చెప్పింది. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. త్రిభాషా విద్యా విధానాన్ని అస్సలే అమలు చేయమని పట్టుబడుతోంది. సర్కారు సైతం అంతే పట్టుదలతో.. తమిళనాడుకు ఇవ్వాల్సిన నిధులను కూడా నిలిపి వేసింది. అయితే ఈ విషయంపై స్పందించిన ఎంపీ కనిమొళి కూడా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. పిల్లల జీవితాలను నాశనం చేయొద్దని చెప్పారు.


ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అనేక మంది ముష్కరులను అంతమొందించింది. అయితే దీనిపై ప్రపంచ దేశాలకు వివరణ ఇవ్వాలని భావించిన కేంద్ర ప్రభుత్వం కొంత మంది ఎంపీల బృందాలను పలు దేశాలకు పంపించింది. మొత్తంగా ఏడు బృందాలు.. 35 దేశాలకు వెళ్లి ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును వివరించే ఏర్పాటు చేసింది. అయితే ఇందులో డీఎంకే ఎంపీ కనిమొళికి కూడా స్థానం దక్కగా.. ఆమె కూడా విదేశాలకు వెళ్లారు.


అయితే తాజాగా ఆమె తన బృందంతో కలిసి స్పెయిన్ వెళ్లారు. ఈ సందర్భంగానే ఆమె మాడ్రిడ్‌లోని ప్రవాస భారతీయులతో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదులకు పాక్ సాయం గురించి చాలా విషయాలు వెల్లడించారు. కానీ ఆ తర్వాతే ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ముఖ్యంగా ఓ ప్రవాస భారతీయుడు లేచి నిలబడి మరీ.. భారతదేశ జాతీయ భాష ఏదని ప్రశ్నించారు. అయితే తనకు కేంద్ర ప్రభుత్వంపై విముఖత ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని వెల్లడించకుండా తెలివిగా, అందరూ మెచ్చే సమాధానం చెప్పారు కనిమొళి.


ముఖ్యంగా భారతదేశ జాతీయ భాష భిన్నత్వంలో ఏకత్వం అంటూ బదులు ఇచ్చారు. ఈ సమాధానం వినగానే అక్కడున్న వారంతా పెద్ద ఎత్తున చప్పట్ల కొట్టారు. ఇదే మా ప్రతినిధి బృందం ప్రపంచానికి ఇచ్చే సందేశం అంటూ వ్యాఖ్యానించారు. ఇదే అత్యంత ముఖ్యమమైన విషయం అని కూడా ఆమె వెల్లడించారు. ఎంపీ కనిమొళి చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజెన్లు సైతం ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇంట్లోని గొడవలను బయటకు తీయకుండా తెలివైన సమాధానం చెప్పారని కామెంట్లు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa