ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగింది

national |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 05:42 PM

బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశమైంది. గతంలో దేశంలో జరిగిన పలు తొక్కిసలాట ఘటనలను గుర్తు చేస్తూ, సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు అంచనాలకు మించి జనం రావడంతో పాటు, అదే సమయంలో వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. కుంభమేళాలో తొక్కిసలాట.. ఇప్పుడు బెంగళూరులో తొక్కిసలాట.. ఈ ఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలు చేయలేదు. పాఠాలు నేర్చుకోలేదు" అని ఆయన పేర్కొన్నారు."మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ ఒక కప్ ఛాయ్ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారట్లేదు" అంటూ గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్‌కు హృదయం ముక్కలైన ఎమోజీని కూడా ఆయన జతచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa