కడప జిల్లా సీకేదిన్నె మండలం పరిధిలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న భూముల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం పాక్షికంగా సవరించింది. వాటిపై యథాతథ స్థితి పాటించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సీకే దిన్నె మండలంలో 63.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ గత నెల 21న జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ సజ్జల కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా సర్వే నంబర్లలో తమకున్న 201.17 ఎకరాల భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరారు. దీనిపై వ్యాజ్యం రాగా ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్పై స్టే విధించారు. దీనిని ప్రభుత్వం అప్పీల్ వేసింది. ఈ అప్పీల్ గురువారం విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘పిటిషనర్ల అధీనంలో 63.72 ఎకరాల అటవీ, ఇరిగేషన్, అసైన్డ్ భూమి ఉందని అధికారులు గుర్తించారు. అయితే దశాబ్దాలుగా ఆ భూములు తమ అధీనంలో ఉన్నాయని చెబుతున్నారు తప్ప వాటి రికార్డులను పిటిషనర్లు అధికారుల ముందు ఉంచలేదు. ఈ నేపథ్యంలో భూములు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. వాటిని కొట్టివేయాలి’ అని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధికారులు నిర్వహించిన పంచనామా చెల్లుబాటు కాదన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa