ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్డీటీ సేవలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 04:10 PM

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ).. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ. విద్యా, వైద్యం వంటి విషయాల్లో గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతవాసులకు సేవలు అందిస్తూ.. వీరితో మమేకమైన సంస్థ. కానీ కొన్ని కారణాలు.. ఆర్డీటీని కలవరపెడుతున్నాయి. ఆర్డీటీ సేవలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. దీంతో సేవ్ ఆర్డీటీ అంటూ ఉద్యమం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. ఆర్డీటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేద‌ల పాలిట వ‌రమైన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు ఆగ‌వని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఆర్డీటీ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.


శుక్రవారం రోజు విలేకర్లతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. ఆర్డీటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని గ్రామీణులకు ఆర్డీటీ సేవలు అందిస్తోందని.. ఆ సేవలు నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు కృషి చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. ఆర్డీటీ విషయమై కేంద్రం.. సంబంధిత శాఖలతో చర్చిస్తున్నట్లు నారా లోకేష్ వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సంస్థ సేవలు అందిస్తోందని మంత్రి నారా లోకేష్ వివరించారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, కణేకల్లులో మూడు ఆసుపత్రులను ఆర్డీటీ నిర్వహిస్తోందని నారా లోకేష్ వెల్లడించారు. ఏటా లక్షల మంది పేదలకు వైద్య చికిత్సలు అందిస్తోందని.. మూగ, చెవిటి, మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థులకు పాఠశాలలను నిర్వహిస్తోందని.. ఆర్డీటీ సేవలను నారా లోకేష్ కొనియాడారు.


ఆర్డీటీ సమస్య ఏంటీ?


స్పెయిన్‌కు చెందిన విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ దంపతులు 1969లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టును స్థాపించారు. అనంతపురం ప్రధాన కార్యాలయంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. ఈ ట్రస్టు ద్వారా విద్యా, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నారు అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటుగా మహబూబ్‌నగర్ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే విరాళాలు ఎక్కువ. స్పెయిన్ వంటి దేశాల నుంచి ఆర్డీటీకి ఏటా పెద్ద ఎత్తున విరాళాలు వస్తుంటాయి. ఈ విరాళాల ద్వారానే ఆర్డీటీ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతోంది.


అయితే ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగం అనుమతులను కేంద్రం నిలిపివేసింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఆర్డీటీ విదేశీ నిధుల వినియోగం అనుమతులను ఆపివేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విదేశాల నుంచి వచ్చే నిధులను ( ఫారిన్ కాంట్రిబ్యూషన్) ఉపయోగించుకునేందుకు ఆర్డీటీకి వీలు లేకుండా పోయింది. దీంతో స్థానికంగా వచ్చే నిధుల (లోకల్ కాంట్రిబ్యూషన్) ద్వారానే కార్యక్రమాలు కొనసాగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్డీటీ సేవల కొనసాగింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఆర్డీటీలో పనిచేస్తున్న సుమారు 3,900 మంది ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.


సేవ్ ఆర్డీటీ..


మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ మూడు ఆస్పత్రులను నిర్వహిస్తోంది. ఇందులో పేదలకు ఉచితంగా, మధ్య తరగతి ప్రజలకు నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ఆస్పత్రుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో కాకుండా.. లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాల్లో జమ చేశారనే ఆరోపణలతో కేంద్రం విదేశీ నిధుల వినియోగంపై ఆర్డీటీకి అనుమతులు నిరాకరించింది. అయితే ఈ ఆరోపణలై ఆర్డీటీకి జరిమానా విధించి.. నిధుల వినియోగంపై అనుమతులు ఇవ్వాలని స్థానికులు, ఆర్డీటీ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa