ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 08, 2025, 06:36 PM

రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి ప్రముఖ టీవీ ఛానల్‌ లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని గురించి, అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా 'వేశ్యలు' అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ, మీడియా ముసుగులో సాగుతున్న ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు."తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం.రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa