స్కూళ్లో ఉన్నపుడు తోటి ఫ్రెండ్స్తో గొడవలు సర్వసాధారణమే. ఇలా గొడవలు పడి పొట్టు పొట్టు కొట్టుకున్నా.. ఆ విషయం టీచర్ వరకు వెళ్లి ఇద్దర్నీ చితకబాదినా.. కొన్నిరోజులు మాట్లాడకుండా ఉండి.. చివరికి కలిసిపోతారు. కొందరు ఒక క్లాస్లో గొడవ అయితే పై క్లాసుకు వెళ్లినా మాట్లాడుకోని వారు ఉంటారు. మరికొందరైతే ఆ స్కూల్ నుంచి వెళ్లిపోయినా మాట్లాడుకోరు. కాలక్రమేణా పెరిగి పెద్ద వాళ్లు అయినపుడు చిన్నతనంలో పెట్టుకున్న గొడవలు అన్నీ చాలా సిల్లీగా, జోక్గా అనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ రోజు ఆ విషయానికి అతడితో గొడవ పడాల్సింది కాదు అని చాలా మంది అనుకుంటారు. ఇక అలాంటి గొడవలు పెట్టుకుని.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ వాళ్లు కనిపించినా.. ఆ గొడవకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపినపుడు కూడా.. పాత గొడవలు ఏమైనా ఉంటే అన్నీ మర్చిపోయి.. అంతా హ్యాపీగా ఉంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం మీరంతా షాక్ అవుతారు. ఎందుకంటే చిన్నతనంలో స్కూళ్లో 4వ తరగతిలో జరిగిన గొడవకు.. ఓ వ్యక్తి 52 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో తిరిగి దాడి చేసి పగ తీర్చుకున్నాడు. కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నూర్ జిల్లాలోని వెల్లరికుండు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీజే బేబీ అనే 62 ఏళ్ల వృద్ధుడిపై బాలకృష్ణన్, మత్తయి వలియప్లాక్కల్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. బాలకృష్ణన్ బేబీని పట్టుకోగా.. అతని ముఖం, వీపుపై మత్తయి వలియప్లాక్కల్ రాయితో కొట్టాడు. దీంతో బేబీకి తీవ్ర గాయాలు కావడంతో కన్నూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్పించారు.
ఈ గొడవకు కారణం 52 ఏళ్ల క్రితం జరిగిన ఘటన అని పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురు వృద్ధులు.. మలోంలోని ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న సమయంలో నాలుగో తరగతిలో కలిసి చదువుకున్నారు. అయితే ఆ సమయంలో బాలకృష్ణన్, మత్తయి వలియప్లాక్కల్లపై వీజే బేబీ దాడి చేశాడు. అయితే ఇది జరిగి చాలా సంవత్సరాలు కాగా.. అప్పటి నుంచి వారు ముగ్గురూ స్నేహితులుగానే ఉన్నారు. అంతేకాకుండా వారి పొలాలు పక్క పక్కనే ఉండటంతో నిత్యం కలుసుకునే వారు. అయితే 5 దశాబ్దాల క్రితం జరిగిన గొడవలో బేబీ తమను కొట్టారని కక్ష పెంచుకున్న బాలకృష్ణన్, మత్తయి.. తాజా ఘర్షణలో అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో వీజే బేబీకి రెండు పళ్లు ఊడిపోవడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
ఈ దాడిలో వీజే బేబీకి రెండు పళ్లు ఊడిపోయాయని.. అయితే దాడిలో పళ్లు విరిగిపోతే అది నాన్ బెయిలబుల్ కేసు అవుతుందని పోలీసులు వెల్లడించారు. దీనిపై డాక్టర్లను అడిగి వివరాలు సేకరిస్తామని చెప్పారు. అయితే ఈ ఘటనపై కోర్టు, కేసు కాకుండా.. బయట మాట్లాడుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు తమకు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. తనను కొట్టినందుకు పరిహారంగా నిందితులు ఇద్దరు బాలకృష్ణన్, మత్తయి కలిసి రూ.1.5 లక్షలు చెల్లించాలని వీజే బేబీ డిమాండ్ చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa