ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజా రఘువంశీ పోస్టుమార్టంలో తలపై రెండు బలమైన గాయాలు, తీవ్ర రక్తస్రావంతో మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 10:37 AM

హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. భార్య సోనమ్‌తో కలిసి వెళ్లిన రఘువంశీ అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ తర్వాత ఆయన భార్యే ఈ హత్య చేయించిందన్న ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా నిన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్‌లో పోలీసులకు సోనమ్ లొంగిపోవడంతో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగింది.మే 20న రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. రెండు రోజుల తర్వాత మే 22న ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుని మౌలికాయత్ అనే గ్రామానికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ తర్వాతి రోజు నుంచి వారి ఆచూకీ గల్లంతైంది. సుమారు పది రోజుల అనంతరం సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. రఘువంశీ తలపై రెండు బలమైన గాయాలున్నాయని, ఒకటి తల ముందు భాగంలో, మరొకటి వెనుక భాగంలో తగిలినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ గాయాలు లోతుగా ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది.ఈ హత్య వెనుక భార్య సోనమ్ హస్తం ఉందని, సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ఈ దారుణానికి పాల్పడిందని మేఘాలయ పోలీసులు అనుమానిస్తున్నారు. సోనమ్‌కు రాజ్ కుష్వాహ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అతడితో కలిసే ఈ హత్యకు పథకం రచించిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కుష్వాహ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు ఆకాష్ రాజ్‌పుత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్‌లను మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డీజీపీ ఇడాశిష నాన్‌గ్రాంగ్ ధ్రువీకరించారు. భర్త హత్యలో సోనమ్ ప్రమేయం ఉందని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. రఘువంశీ మృతదేహం లభ్యమైన వారం రోజుల తర్వాత సోనమ్ లొంగిపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa