రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణను పూర్తిగా గాలికొదిలేసిన హోంమంత్రి వంగలపూడి అనిత వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మాజీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తైన నేపధ్యంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో దారుణంగా హత్యకు గురైన ఇంటర్ విద్యార్థి తన్మయి ఘటనపైనా, పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అధికార పార్టీకి చెందిన వ్యక్తి అత్యాచారం పైనా హోంమంత్రి కనీసం ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో బాలికను ఆరు నెలలుగా 14 మంది అధికార పార్టీకి చెందిన యువకులు అత్యాచారం చేసిన ఘటనలో ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధ్యతగల హోంమంత్రిగా శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసిన అనిత కేవలం వైయస్ జగన్ ను తిట్టడానికి మాత్రమే ముందుంటారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షి ఛానెల్ చర్చాకార్యక్రంలో జర్నలిస్టు మాటలకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఖండించినా వాటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి ఛానెల్ కి ఆపాదించడం సరికాదన్నారు. హోంమంత్రి అనిత గతంలో వైయస్.విజయమ్మ, భారతమ్మ మీద చేసిన అభ్యంతకరమైన వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. ముందుగా తన వ్యాఖ్యలకు హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, యువతలు, చిన్నారుల పట్ల జరుగుతున్న అరాచకాలను ఆపి, బాధితులకు అండగా నిలబడి, వారిని ఆధుకోవాల్సింది పోయి... డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న తీరును ఆక్షేపించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన గౌరవం మరే సీఎం ఇవ్వలేదని గుర్తు చేశారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించిన వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత కూటమి నేతలు లేదని తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa