ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి ఆర్టీసీ డిపోలో సరికొత్తగా,,,ఛార్జింగ్‌ స్టేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:30 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాలు నడుస్తుండగా.. ఆర్టీసీ కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్ అవసరాలను గమనించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం MTMC కేంద్రంగా 7 మెగావాట్ల సామర్థ్యంతో ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. విద్యుత్ సరఫరా చేస్తోంది.


ఇప్పటికే గంటూరు జిల్లా పాతూరులో 1.8 మెగావాట్ల సామర్థ్యంతో ఒక ప్రైవేటు సంస్థ 60 బస్సులకు ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యంతో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా కాజాలో 3 కేంద్రాలు ఉన్నాయి.. ఇక్కడ ఒక్కో కేంద్రంలో 250 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. కుంచనపల్లిలో 2, ఆత్మకూరులో 1, పెదవడ్లపూడిలో 1 కేంద్రాలను ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెండు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.. మిగిలినవి కూడా పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఛార్జింగ్ గన్‌కు 45 కిలోవాట్ల సామర్థ్యం ఉండగా.. ఈ మేరకు అక్కడ అవసరానికి తగ్గట్టుగా మరికొన్ని గన్‌లను ఏర్పాటు చేసుకుంటారు. అమరావతిలో రాజధాని పనులు చేస్తున్న మరో కంపెనీ కూడా కృష్ణాయపాలెంలో ఛార్జింగ్ సెంటర్ కావాలని దరఖాస్తు చేసుకుంది.


ఏపీలో పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది.. ఛార్జింగ్ చేయడానికి తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తోంది. యూనిట్‌కు రూ.7 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ మేరకు ఎలాంటి స్లాబులు లేకుండా ఎంత వాడుకున్నా సరే యూనిట్‌కు రూ.7 మాత్రమే వసూలు చేస్తారు. అలాగే ఆర్టీసీ కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.. అందుకే దీని కోసం 3 మెగావాట్ల సామర్థ్యంతో మంగళగిరిలో ఛార్జింగ్ సెంటర్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖకు దరఖాస్తు చేయగా మంజూరైంది. ఈ సెంటర్ కోసం రూ.4.70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 33కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి ఆర్టీసీ గ్యారేజీ వరకు ప్రత్యేకంగా లైన్ వేసి విద్యుత్ సరఫరా చేస్తారు. ఈ నిర్ణయంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు డబ్బులు చెల్లించడానికి అంగీకరించడంతో విద్యుత్ శాఖ పనులు చేయడానికి సిద్ధమైంది. మంగళగిరికి మొదటి దశలో ఆర్టీసీ 50 బస్సులు రానున్నాయి.. గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. ఆ తర్వాత మెల్లిగా వీటి సంఖ్య పెరగనుంది. అటు గుంటూరు డిపోకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa