ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశ జనాభా .. యువతే ఎక్కువ, ఐక్యరాజ్యసమితి రిపోర్ట్‌

national |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:11 PM

ఐక్యరాజ్యసమితి జనాభా నివేదిక 2025 విడుదలైంది. ఇందులో భారతదేశ జనాభా 146 కోట్లు(1,463,900,000) ఉన్నట్లు తెలిపింది. అయితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్ రేటు కన్నా తగ్గుతుండటం అతిపెద్ద సంక్షోభం అని వెల్లడించింది. ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ పేరుతో యూఎన్ఎఫ్‌పీఏ 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ విడుదల చేసిన ఈ నివేదిక.. సంతానోత్పత్తి తగ్గడం నుంచి పునరుత్పత్తి లక్ష్యాలను పరిష్కరించడం వైపు మారాలని సూచించింది. భారత్‌లో లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు వివరించింది. ఇదే సమయంలో దేశంలో యువ జనాభా అధికంగా ఉందని.. భారత దేశ జనాభా 170 కోట్లకు చేరుకున్న తర్వాత.. తగ్గడం ప్రారంభం అవుతుందని.. అయితే అందుకు మరో 40 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది.


సంతానోత్పత్తి తగ్గడమే నిజమైన సంక్షోభం


ఏ దేశంలో అయినా జనాభా తక్కువగా ఉండటం లేదా అధికంగా జనాభా ఉండటం నిజమైన సంక్షోభం కాదని పేర్కొన్న యూఎన్ రిపోర్ట్.. సంతానోత్పత్తి తగ్గడమే నిజమైన సంక్షోభమని స్పష్టం చేసింది. జనాభా కూర్పు, సంతానోత్పత్తి, ఆయుర్దాయం వంటి కీలక మార్పులను కూడా ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు స్త్రీకి 1.9 జననాలకు తగ్గినట్లు నివేదిక చెబుతోంది. ఇది జనాభా పరిమాణాన్ని ఒక తరం నుంచి మరో తరాన్ని సృష్టించడానికి అవసరమైన 2.1 (రీప్లేస్‌మెంట్ రేటు) భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. అంటే భారతదేశంలో ప్రజలు ప్రస్తుత తరం జనాభాను స్థిరంగా ఉంచడానికి అవసరమైన దానికంటే తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నట్లు అర్థం.


భారతదేశానికి యువ జనాభా బలం


దేశంలో జననాల రేటు తగ్గుతున్నప్పటికీ యువత జనాభా గణనీయంగా ఉందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది. మొత్తం భారతదేశ జనాభాలో 0-14 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు 24 శాతం.. 10-19 ఏళ్ల వయస్సులో ఉన్నవారు 17 శాతం.. 10-24 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారు 26 శాతం మంది ఉన్నారని పేర్కొంది. దేశంలోని 68 శాతం జనాభా పని చేసే వయస్సు (15-64 ఏళ్లు) కలిగి ఉందని వివరించింది. ఇది దేశంలో ఉపాధి అవకాశాలకు తగినంత జనాభాను అందిస్తుందని వెల్లడించింది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా కేవలం 7 శాతం మాత్రమే ఉందని చెప్పింది. అయితే దేశంలో ఆయుర్దాయం పెరగడంతో భవిష్యత్‌లో ఈ జనాభా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.


ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశ జనాభా 146.39 కోట్లుగా ఉంది. దీంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది. అయితే దేశంలో 170 కోట్లకు చేరిన తర్వాత మాత్రమే.. జనాభా తగ్గుముఖం పడుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. అయితే జనాభా తగ్గుముఖం పట్టడానికి ఇప్పటినుంచి సుమారు 40 ఏళ్లు పడుతుందని పేర్కొంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa