ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ.1 లక్ష ఆదాయం.. ఇంటిపై మొబైల్ టవర్ ఏర్పాటు ప్రాసెస్, రూల్స్ ఇవే

business |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 09:44 PM

ఇంటిపైన లేదా పక్కన ఖాళీ స్థలం ఉంటే ఎలాంటి పెట్టుబడి లేకుండానే స్థిరమైన ఆదాయం అందుకోవచ్చు. ఇందుకు పలు మార్గాలు ఉన్నాయి. అందులో మొబైల్ టవర్స్ ఇన్‌స్టాలేషన్ ఒకటి. దీని ద్వారా నెలకు రూ. 10 వేల నుంచి రూ.1 లక్ష వరకు అద్దె రూపంలో ఆదాయం పొందవచ్చు. ఇంటి ఖాళీ స్థలంలో మొబైల్ టవర్ ఏర్పాటు కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మీ ఇంటి వద్ద సరిపడ ఖాళీ స్థలం ఉంటే మొబైల్ టవర్ ఏర్పాటు చేయవచ్చు. నేరుగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ టవర్లు ఇన్‌స్టాల్ చేసి నిర్వహణ బాధ్యతలు చూసే చాలా కంపెనీలు ఉన్నాయి. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇండస్ టవర్స్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, టాటా కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, తేజస్ వంటి కంపెనీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తుంటాయి.అలాగే జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీలు కూడా సొంతంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వాటి ద్వారానూ మీరు టవర్ ఏర్పాటు చేయవచ్చు.


 అయితే మొబైల్ టవర్ ఏర్పాటుకు కనీసం 2000 చదరపు అడుగుల స్థలం ఉండాలి. బిల్డింగ్ పైన అయితే 500 చదరపు అడుగులు ఉండాలి. ఖాళీ స్థలంపై ఎలాంటి లోన్ ఉండొద్దు. బిల్డింగ్ పైభాగంలో టవర్‌ ఏర్పాటు చేయాలనుకుంటే స్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. ఆసుపత్రులు, పాఠశాలలు పక్కన ఉండకూడదు. వాటికి 100 మీటర్ల దూరంలో ఉంటేనే అనుమతిస్తారు. టవర్ ఇన్‌స్టాలేషన్ కంపెనీలను సంప్రదించి టవర్లను మీ స్థలంలో ఇన్‌స్టాల్ చేసేందుకు ఆహ్వానించవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారానూ సంప్రదించవచ్చు. కొన్నిసార్లు తమ సేవలను విస్తరించే క్రమంలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లే మిమ్మల్నే సంప్రదించవచ్చు.


ఇన్‌స్టాలేషన్‌కు ముందే మీ స్థలం రేడియో ఫ్రీక్వెన్సీకి అనుకూలమా లేదో చూస్తారు. అన్ని ఓకే అనుకుంటేనే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆ తర్వాత మీ స్థలాన్ని లీజుకు తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మీకు నెల నెలా అద్దె చెల్లిస్తారు. భూమి పరిమాణం, రిస్క్ వంటి అంశాలపై ఆధారపడి అద్దె నిర్ణయిస్తారు. చాలా సందర్భాల్లో నెలకు రూ. 10 వేలు, రూ. 50 వేలు, గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ఇస్తారు.


మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్‌ అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ హెచ్చరించింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో, వీఐ పేర్లతో టవర్లు ఏర్పాటు చేసి డబ్బు సంపాదించ్చవచ్చంటూ వచ్చే కాల్స్ ని గుడ్డిగా నమ్మవద్దని సూచించింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎలాంటి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. అలాగే ఈ కథన కేవలం సమాచారం కోసమే. అన్ని వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa