ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్ విమానంలో సాంకేతిక సమస్యలు.. ముందే పసిగిట్టిన ప్రయాణికుడు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 07:27 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం రోజు మధ్యాహ్నం ఎయిరిండియా విమానం కుప్పకూలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు సహా 12 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తుండగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరగడానికి రెండు గంటల ముందే ఓ ప్రయాణికుడు ఈ విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించాడు. దాన్ని వీడియోగా కూడా తీసి.. ఎయిరిండియాక పంపాలనుకున్నాడు. కానీ అతడు పంపకముందే ప్రమాదం జరగ్గా.. దాన్ని నెట్టింట పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


అహ్మదాబాద్ విమానం ప్రమాదానికి గురికావడానికి కేవలం రెండు గంటల ముందు.. అదే విమానంలో ఢిల్లీ నుండి అహ్మదాబాద్‌కు ప్రయాణించిన ఒక ప్రయాణికుడు విమానంలోని పలు సాంకేతిక లోపాలను గుర్తించాడు. వాటిని తన సెల్‌ఫోన్‌తో వీడియోగా కూడా తీశాడు. అయితే దాన్ని ఎయిరిండియాకు పంపించాలనుకున్నాడు. కానీ అంతకంటే ముందే ఈ విమానం లండన్‌కు బయలు దేరింది. మొత్తంగా 242 మందితో టేకాఫ్ అయింది. కానీ కాసేపట్లోనే ప్రమాదానికి గురై జనావాసాల్లో కుప్పకూలింది. ఫలితంగా అందులో ఉన్న వారంతా చనిపోయారు. అంతేకాకుండా జనావాసాలపై పడగా.. ఇళ్లల్లో ఉన్నవారు కూడా కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు.


అయితే ఈ ప్రమాద విషయం తెలుసుకున్న సదరు ప్రయాణికుడు తన ఎక్స్ ఖాతా వేదికగా.. తాను తీసిన వీడియోను షేర్ చేశాడు. ఆ విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించానని చెప్పాడు. ప్రమాదానికి గురయ్యే రెండు గంటల ముందే తాను అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినట్లు వివరించాడు. అలాగే ప్రయాణ సమయంలో విమానంలో ఏసీ సరిగా పని చేయలేదని, అలాగే కనీస సౌకర్యాల విషయంలో కూడా తనిఖీలు సరిగా జరగలేదని ఆరోపించారు. అయితే వీటిని ముందే గుర్తించిన తాను.. ప్రమాదం జరిగిన వెంటనే @airindia, @aajtak, @ndtv, @Boeing_In వంటి అధికారిక ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ వీడియో షేర్ చేశానని తెలిపారు.


అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా విమానం యొక్క నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందే గట్టిగా చెప్పుంటే ఇంత మంది కాపాడిన వాడివయ్యేవాడివి కదా బ్రదర్ అని కొందరు, ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పి ఏం లాభమని కొందరు, జర్రుంటే నువ్వే పోయవాడివిగా తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోను అధికారులు చూస్తే.. ప్రమాదానికి గురైన విమానంలో గుర్తించిన లోపాలను అధికారులు నిర్లక్ష్యం చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇది మాత్రమే కాకుండా సదరు ప్రయాణికుడు అందించిన వివరాలు, ఆయన తీసిన వీడియో, ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడంలో కీలక ఆధారాలుగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమాదానికి గల కారణాలపై విమానయాన భద్రతా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ, సాంకేతిక నిపుణుల పరిశీలన కొనసాగుతోంది. ఈ ప్రయాణికుడి సాక్ష్యాధారాలతో దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa