తిరుమలతో పాటూ చుట్టుపక్కల పురాతన కట్టడాలు చాలానే ఉన్నాయి.. ఈ కట్టడాలను పరిరక్షించే పనిలో ఉంది టీటీడీ. ఈ మేరకు అలిపిరిలో ఉన్న పురాతన పాదాల మండపం పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 300 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మండపం శిథిలావస్థకు చేరింది. ఈ మండపాన్ని తొలగిస్తున్నట్లు గత ప్రభుత్వ హయాంలో విమర్శలు వచ్చాయి.. ఆందోళనలు చేపట్టారు. అయితే టీటీడీ, కూటమి ప్రభుత్వం ఈ మండపం పరిరక్షణకు సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు, నిపుణులు, దాతలు ఈ మండపాన్ని పరిశీలించారు.. దీనిని పాత పద్ధతిలోనే పరిరక్షించాలని నిర్ణయించారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ పాదాల మండపాన్ని తిరుమలలోని పార్వేట మండపం తరహాలో తొలగిస్తారనే ప్రచారం జరిగింది. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలోనే మండపాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.. దీంతో ఆ మండపాన్ని తొలిగించడం లేదని అప్పట్లో టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తాజాగా పురావస్తుశాఖ అధికారి మునిరత్నంరెడ్డి సహకారంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు స్పందించారు. ఏఎస్ఐ రిటైర్డ్ డైరెక్టర్ జమ్వాల్ (పుణె), విశాల్ బృందం, లార్డ్ వెంకటేశ్వర రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు (పుణె), ఇంజనీరింగ్ అధికారుల దాతలతో కలిసి మండపాన్ని పరిశీలించారు. ప్రాచీన పద్ధతుల్లోనే ఈ పాదాల మండపాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.. త్వరలోనే ఈ మండపం సంరక్షణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు తిరుమలకు వచ్చే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. 'తిరుమలకు రాకపోకలు సాగించే కనుమ దారుల యందు ( ఘాట్ రోడ్డులలో) బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలి. శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కనుక, భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరుతోంది. మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించగలరు' అని సూచించింది.
'భక్తులు మరింత సులభంగా, సౌకర్యంగా ప్రయాణించేేందుకు ఈ మరమ్మతు పనులను టీటీడీ చేపట్టింది. ఈ నేపథ్యంలో భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుండి తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి సూచిస్తోంది. మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టిటిడిలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తిరుమల చేరుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని టిటిడి కోరుతోంది. అత్యవసర సేవలకు టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు సంప్రదించండి' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa