ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 04:12 PM

రాష్ట్రంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన సోషల్ మీడియా  ప్లాట్‌ఫాం 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం  జిల్లా పొదిలి  వెళ్లానని తెలిపారు. కానీ చంద్రబాబు తానేదో విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చేస్తున్నానని అనడం మీరు భావ్యమా చంద్రబాబు అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలి వచ్చారని తెలిపారు. తాము వెళ్తున్న మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారని ధ్వజమెత్తారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు  గారు.. అంటూ ఆక్షేపించారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా అడ్డగోలు ఆరోపణలు చేయడం దుర్మార్గం కాదా అన్నారు. రాళ్ల దెబ్బలు తిన్న తమ కార్యకర్తలు, రైతులపై ఉల్టా కేసులు బనాయిస్తారా.. అని మండిపడ్డారు. రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా.. రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అంటూ జగన్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa