ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందని అబ్బాస్ అరాక్చీ విమర్శ

international |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 09:12 PM

ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్ సంచలన ఆరోపణలతో ముందుకొచ్చింది. ఇజ్రాయెల్ తమ దేశంపై జరుపుతున్న దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని, అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే టెల్ అవీవ్ ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టేది కాదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి అబ్బాస్ అరాక్చీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దాడులకు అమెరికా మద్దతు ఇస్తోందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.అమెరికా తన నిజాయతీని నిరూపించుకోవాలంటే, ఇజ్రాయెల్ దాడులను తక్షణమే బహిరంగంగా ఖండించాలని అరాక్చీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, ఈ దాడులలో అమెరికా ప్రమేయం ఉందని ప్రపంచం భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు, ఇజ్రాయెల్ చర్యల విషయంలో ఐక్యరాజ్యసమితి  అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, ఇరాన్‌పై దాడులకు తెగబడుతున్న ఇజ్రాయెల్‌ను వదిలేసి, పాశ్చాత్య దేశాలు ఇరాన్‌ను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ తమ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని చూస్తోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ గనుక తమపై సైనిక చర్యలను నిలిపివేస్తే, తాము కూడా దాడులను ఆపేస్తామని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అరాక్చీ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రంగా పేరుగాంచిన ‘ది సౌత్ పార్స్ క్షేత్రం’పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని అబ్బాస్ అరాక్చీ తీవ్రంగా ఖండించారు. ఈ గ్యాస్ క్షేత్రాన్ని ఖతార్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నామని, ఇజ్రాయెల్ దుందుడుకు చర్యకు ఇది ఒక నిదర్శనమని ఆయన అన్నారు. యుద్ధాన్ని మరింత విస్తరింపజేయాలనే కాంక్షతోనే ఇజ్రాయెల్ ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. "వివాదాన్ని పర్షియన్ గల్ఫ్ వరకు లాగడం ఇజ్రాయెల్ చేసిన వ్యూహాత్మక తప్పిదం. యుద్ధాన్ని ఇరానియన్ భూభాగం దాటి విస్తరించాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది," అని అబ్బాస్ అరాక్చీ ఆరోపించారు.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇరాన్‌లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ ఇప్పటికే డేంజర్ లైన్  దాటిందని అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఇరాన్-అమెరికా మధ్య జరగాల్సిన అణు చర్చలను దెబ్బతీయడానికే ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకపోయి ఉంటే, అమెరికాతో అణు ఒప్పందానికి మార్గం సుగమం అయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa