ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంతి పూల సాగుతో,,,ఏడాదికి రూ.5 కోట్ల టర్నోవర్

business |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 09:28 PM

బంతి పూలు.. భారతీయుల జీవితంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మార్కెట్లో ఎన్ని పూలు ఉన్నా వీటికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇంట్లో, వీధుల్లో, గుళ్లల్లో ప్రతి పూజా పునస్కారానికీ ఈ పూలనే వాడతాం. ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసిన బంతి పూలతో అలంకరిస్తేనే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాంటి బంతి పూలను సాగు చేస్తూ ఓ యువకుడు ఏడాదికి రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్‌కు వచ్చి రోజు కూలీగా పని చేశాడు. బంతి పూల వ్యాపారంలో మెలుకవలు నేర్చుకుని దశాబ్దం తిరిగేలోపే పెద్ద వ్యాపారిగా మారిపోయాడు. అతనే అరూప్ కుమార్ ఘోష్. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ యువకుడి గురించీ మీరు తెలుసుకోండి మరి.


2010లో అరూప్ కుమార్ ఘోష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రెండేకరాల్లో వరి సాగు చేయగా నష్టం వచ్చింది. దీంతో అరూప్ ఘోష్ చదువు మానేయాల్సి వచ్చింది. బెంగాల్‌లోని వాళ్లు నివాసం ఉంటున్న ఏరియా కోలాఘాట్ టౌన్‌లోని అతిపెద్ద పూల మార్కెట్లో కూలీగా చేరాడు. అలా బంతిపూలతో అనుబంధం ఏర్పడింది. అక్కడి నుంచి హైదరాబాద్ గుడిమల్కాపూర్‌ మార్కెట్లోకి బంతిపూలు సహా ఇతర పూలు సరఫరా కావడాన్ని గమించాడు. దక్షిణ భారత్‌లో అతిపెద్ద పూల మార్కెట్‌ అని తెలుసుకుని అరూప్ హైదరాబాద్ వచ్చాడు. ఓ పూల దుకాణంలో కూలీగా చేరాడు. నెలకు రూ.3500 జీతంతో కొన్నాళ్లు పని చేశాడు. పూల రకాలు, వాటి ధరలు, నిల్వ విధానాల వంటి అన్నింటిపై పట్టుసాధించాడు. వ్యాపారిగా మారాలనుకున్నాడు. ఈ కలతో సొంతూరు చేరాడు. కోలాఘాట్ నుంచి హైదరాబాద్‌కి పూలు సరఫరా చేయడం మొదలు పెట్టాడు. మంచి ఆదాయం వచ్చింది. అయితే అక్కడితో ఆగిపోలేదు.


తానే బంతి పూలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. సాగు మొదలుపెట్టాడు. తన తండ్రికి ఉన్న రెండెకరాల్లో 25 సెంట్లలో బంతిపూలు సాగు చేసి సరఫరా చేయాలనుకున్నా తొలుత నష్టాలే మిగిలాయి. కానీ, అరూప్ ఆగిపోలేదు. ఒకసారి స్నేహితులతో కలిసి థాయ్ లాండ్ వెళ్లినప్పుడు అక్కడ టెన్నిస్ బాల్ జాతి బంతి పూలను చూసి ఆకర్షితుడయ్యాడు. ఎంతో అందంగా, పెద్దగా ఉండడమే కాదు, ఎగుమతులు చేసేందుకు వీలుగా బలంగా ఉండడడాన్ని గమనించాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు 25 గ్రాముల విత్తనాలు తెచ్చాడు. ఇక్కడ సాగు చేశాడు. అవి 45 రోజుల్లోనే పూలు ఇచ్చాయి. వాటిని కిలోకి 100 చొప్పున విక్రయించడంతో మంచి లాభం వచ్చింది. ఈ పూలను చూసిన ఇతర రైతులు తమకు విత్తనాలు కావాలని అడిగారు. ఈ విషయాలను గమనించి 6 ఎకరాలు లీజుకు తీసుకుని ఏకేజీ నర్సరీ అనే సంస్థను స్థాపించి విత్తనాలు, మొక్కలు విక్రయించడం మొదలు పెట్టాడు.


2013లో అరూప్ వయసు 23 ఏళ్లు మాత్రమే. అప్పుడు 6 ఎకరాల్లో మొదలు పెట్టి 45 ఎకరాలకు బంతి పూల సాగను పెంచాడు. పూల మొక్కలు, విత్తనాలను దేశవ్యాప్తంగా సరఫరా చేయసాగాడు. ఏటా 1200 కిలోల విత్తనాలు, కిలో 25 చొప్పిన విక్రయిస్తున్నాడు. అలాగే 40 పైసలకు ఒక మొక్క చొప్పున ఏడాదికి 2 కోట్లకుపైగా మొక్కలు విక్రయిస్తున్నాడు. మొత్తంగా ఏడాదికి రూ. 5 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. పూల వ్యాపారిగా బెంగాల్ వ్యాప్తంగా 13 షాపులు నిర్వహిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa