ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరేడు పండ్లతో పాటు లేదా తిన్న తర్వాత కొన్ని ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 11:26 PM

నేరేడు పండ్లు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే పండు. ఇది తియ్యగా, పుల్లగా, కొద్దిగా వగరుగా ఉండే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నేరేడు పండ్లలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కాకుండా, నేరేడు పండ్లలో ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నేరేడు పండ్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, నేరేడు పండ్లను కొన్ని ఆహారాలు కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.


పాలు, పాల ఉత్పత్తులు


​నేరేడు పండ్లు పుల్లగా ఉంటాయి. వీటిలో ఆమ్ల గుణం ఉంటుంది. పాల ఉత్పత్తులతో (పాలు, పెరుగు వంటివి) కలిపి తీసుకోవడం వల్ల పాలు విరిగిపోయి, జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట సమయం గ్యాప్ ఇచ్చి పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది.


నీరు


​నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్,కొన్నిసార్లు విరేచనాలకు దారితీయవచ్చు. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నుండి 40 నిమిషాల వరకు నీరు తాగకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


పసుపు, పసుపు కలిపిన ఆహారాలు


నేరేడు పండ్లు, పసుపు రెండింటికి విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతారు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం, నొప్పి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండు తిన్న తర్వాత పసుపు లేదా పసుపు కలిపిన ఆహారాలను తినడానికి కనీసం అరగంట నుంచి 1 గంట సమయం ఇవ్వడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


పచ్చళ్లు


ఊరగాయలలో నూనె, మసాలాలు, పులుపు ఎక్కువగా ఉంటాయి. నేరేడు పండ్లు పుల్లగా ఉంటాయి. కాబట్టి, వీటిని ఊరగాయలతో కలిపి తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగి, ఎసిడిటీ, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అజీర్ణం, విరేచనాలకు కూడా దారితీయవచ్చు.నేరేడు పండ్లను ఊరగాయలతో కలిపి తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే కనీసం 30 నిమిషాల నుండి 1 గంట గ్యాప్ ఇవ్వండి.


స్వీట్లు


నేరేడు పండ్లు తిన్న వెంటనే స్వీట్లు తినడం వల్ల కడుపులో భారం, ఉబ్బరం లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉందని కొందరు సూచిస్తారు. అందుకే నేరేడు పండ్లతో కలిపి స్వీట్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.


ఖాళీ కడుపుతో తినకండి


​నేరేడు పండ్లు పుల్లగా ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తింటే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరిగి ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపులో మంట, వికారం, లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంది. ఆహారం తిన్న తర్వాత లేదా ఏదైనా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాత నేరేడు పండ్లు తినడం మంచిది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవడం ఉత్తమం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa