విజయవాడలో ఓ వింత ఒప్పందం కలకలం రేపింది. కేవలం ఐదు రోజుల పాటు కొనసాగే పెళ్లి కోసం ఓ యువతికి రూ.50,000 చెల్లించేందుకు ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కాని యువకుడికి, అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్న ఒక యువతిని పెళ్లికాని అమ్మాయిగా నమ్మించి దారుణంగా మోసగించిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులు కీలక పాత్ర పోషించి, బాధితుడి నుంచి సుమారు రూ.4 లక్షలు దండుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బట్టబయలైంది.పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన 34 ఏళ్ల యువకుడికి చాలాకాలంగా వివాహం కుదరడంలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో కూడా సంబంధాలు చూడమని కర్ణాటకలో ఉంటున్న శ్రీదేవి అనే మధ్యవర్తిని కోరారు. ఆమె ద్వారా విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తి వారికి పరిచయమైంది. తాయారు, తన బృందంలోని పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావులతో కలిసి కృష్ణలంకకు చెందిన పల్లవి అలియాస్ ఆమని అనే యువతిని పరిచయం చేశారు. గత నెల (మే) 13న విజయవాడలో పెళ్లిచూపుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లి నిశ్చయించారు. అయితే, అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కోసమని నమ్మబలికి పెళ్లికి ముందే వరుడి కుటుంబం నుంచి రూ. 3.5 లక్షలు వసూలు చేశారు. ఈ నెల 5వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రిపై యువకుడితో పల్లవి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం, జూన్ 7న కర్ణాటకలోని గంగావతిలో నూతన దంపతులకు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు. పల్లవి వెంట ఆమె సోదరుడిగా వచ్చిన హరీశ్ అనే వ్యక్తి రిసెప్షన్ ముగిసిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ వరుడి కుటుంబం నుంచి మరో రూ.50,000 తీసుకుని ఉడాయించాడు.కర్ణాటక వెళ్లినప్పటి నుంచి పల్లవి తన భర్తను దూరం పెడుతూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు ఇది వరకే వివాహమైందని, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో వరుడి కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నానని, ఐదు రోజుల పాటు పెళ్లికూతురుగా నటిస్తే రూ.50,000 ఇస్తామని తాయారు, పార్వతి, విమల, అప్పారావు అనే దళారులు ఆశ చూపారని, వారి మాటలు నమ్మి ఈ పెళ్లికి అంగీకరించానని ఆమె తెలిపింది. తనకు రూ.50,000 ఇస్తామని చెప్పి, కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు బ్రోకర్లే తీసుకున్నారని వాపోయింది. అంతేకాకుండా, తన అసలు పేరు ఆమని అని, పల్లవి కాదని చెప్పడంతో తాము దారుణంగా మోసపోయామని బాధితుడి కుటుంబ సభ్యులు గ్రహించారు. దీంతో వెంటనే వారు విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa