.తెనాలిలో ఓ కుటుంబం తమ పెద్దమనసు చాటుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం తమ ఎకరా పొలం విరాళంగా అందించి.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. నలుగురికి ఉపయోగపడే ప్రాజెక్టు కావటంతో కోటి విలువైన తమ ఎకరా పొలాన్ని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో చిన్న ,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఇందుకు భూమి అవసరం కాగా పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్, పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ప్రభుత్వానికి ఎకరం పొలం విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. సోమవారం తెనాలిలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంప్ కార్యాలయంలో తమ కుటుంబసభ్యులతో కలిసి పొన్నెకంటి సువర్చల శశికిరణ్ రూ. కోటి విలువ గల తమ ఎకరా పొలాన్ని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం అందజేశారు.
మరోవైపు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా గొప్ప మనసు చాటుకున్నారు. ఈ కాంప్లెక్స్ అభివృద్ధి పనుల కోసం తన సొంత డబ్బులు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ద్వారా మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. తండ్రి పోతురాజు స్ఫూర్తితో ఆయన కుమార్తె పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం భూమిని దానం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. తన వద్ద ఉన్న అరెకరం పొలానికి జతగా.. మరొక అర ఎకరం స్థలం కొనుగోలు చేసి.. మొత్తం రూ. కోటి విలువగల ఎకరా పొలాన్ని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఇవ్వటం ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి అన్నారు.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతులు అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమాజంలో అందరికి ఉపయోగపడే విధంగా సేవా రంగంలో ఎక్కువగా పని చేయాలని.. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. తెనాలి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. మరిన్ని ప్రాజెక్టులు రావాలని అందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కొలకలూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలో రోల్ మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరోవైపు ఫలితం ఆశించకుండా పదిమందికి ఉపయోగపడేలా ఊరిని అభివృద్ధి చేయడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ మీద నమ్మకంతో ప్రాజెక్ట్ కోసం ఎకరం పొలాన్ని ఇస్తున్నట్లు పొన్నెకంటి సువర్చల శశికిరణ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa