ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి విమర్శలు గుప్పించారు. వివిధ అంశాలపై చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ వస్తున్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఈసారి నారా లోకేష్ అంశాన్ని అస్త్రంగా చేసుకుని చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు నాయుడు.. తన కుమారుడైన నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తు్న్నారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అదేంటీ.. చంద్రబాబు, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. మంత్రిని చేసి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కూడా అప్పగించిన తర్వాత కూడా అసదుద్దీన్ ఒవైసీ ఈ మాట ఎందుకన్నారని అనుకుంటున్నారా..అందుకు కూడా ఓ కారణం ఉంది. అందుకు అసదుద్దీన్ ఒవైసీ చెప్తున్న లాజిక్ ఒకటుంది మరి.
నారా చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీ పగ్గాలను చేపట్టేదెవరు అనే దానిపై చర్చ జరుగుతున్న తరుణంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారని.. ఆయనకు అది సరిపోదా అని ఒవైసీ ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా తాను దిగిపోయి.. రాబోయే తరానికి నాయకత్వం అందించాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నట్లుగా టీడీపీ నాయకత్వానికి సరైన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కాదని, నారా లోకేష్ అని ఒవైసీ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పదవిలోకి రాలేడు కదా అన్న అసదుద్దీన్ ఒవైసీ.. వీలైనంత తొందరగా లోకేష్ బాధ్యతలు అప్పగించాలన్నారు. లేకపోతే టీడీపీ భవిష్యత్తు, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందంటూ హెచ్చరించారు. అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయనేదీ చూడాల్సి ఉంది.
మరోవైపు నారా లోకేష్కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారంటూ మహానాడు సమయంలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కడపలో జరిగిన మహానాడులో టీడీపీ బాధ్యతలను నారా లోకేష్కు అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa