గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ప్రమాదం సమయంలో విమానంలో మొత్తంగా 242 మంది ఉండగా.. అందులో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. అదే అందరికీ షాకిచ్చే విషయం కాగా.. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా వెనకాలం మొత్తం పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తుండగా.. వాటి మధ్య నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ తెల్లటి రంగు టీషర్టులో బయటకు నడుచుంటూ వచ్చి షాక్ ఇచ్చారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ తెగ ఆశ్చర్యపోతూనే.. ఎలా అబ్బా ఈయన ప్రాణాలతో బయటపడ గలిగారంటూ కామెంట్లు చేస్తున్నారు.
విమానం.. నివాస సముదాయాల మధ్య బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలగానే స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో తెలుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం స్థానికులు గమనించారు. ఆయనను చూసి తొలుత వారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత శరీరంపై గాయాలు చూసి వెంటనే అక్కడి నుంచి అంబులెన్సు వద్దకు తీసుకెళ్లారు.
అనంతరం ఆ వ్యక్తి.. ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ అని తెలిసింది. ఘటనాస్థలం నుంచి ఆయన బయటకు వస్తుండగా వెనుక విమానం కాలిపోయిన దృశ్యాలు ఈ వీడియోలో కన్పించగా.. ప్రమాదం కారణంగా అక్కడ భారీ ఎత్తున పొగ అలుముకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా విమాన శకలాలన్నీ చిందర వందరగా పడి ఉండగా.. పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. భగ్గుమంటూ చప్పుడు అవుతుండగానే.. మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులో ఫోన్ చూస్తూ వచ్చిన తీర్ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. ముఖ్యంగా విమాన ప్రమాద తీవ్రతను తలచుకుంటే.. ఈ ఘటన ఓ అద్భుతంగా తోస్తోంది.
బ్రిటన్లో నివాసముంటున్న విశ్వాస్కుమార్.. గుజరాత్లోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో ఆయన కూర్చున్నారు. విమానం కూలగానే తన సీటు విరిగి కింద పడిపోయిందని.. అందుకే విమానంలో చెలరేగిన మంటలు తనకు అంటుకోలేదని ఇటీవల తెలిపారు. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నట్టు.. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చానని అన్నారు. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. విశ్వాస్ ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక, విమానం భవనంపై కూలడంతో అందులోని 33 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa