ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత అన్నారు. మంగళవారం ఆమె మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీ నాయక్ ఇంటిని సందర్శించారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాములు నాయక్ను ఓదార్చారు. అమరజవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు.. వారికి రూ.50 లక్షల చెక్కు, ఐదెకరాల భూమి, ఇంటి స్థలం పత్రాలను అందజేశారు. అనంతరం వీరజవాన్ ఘాట్వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత విలేకరులతో మాట్లాడారు. మురళీ నాయక్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా సంప్రదిస్తే వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కళ్లి తండా నుంచి జవాన్ ఘాట్ వరకు రూ.16 లక్షలతో సీసీ రోడ్డు, జవాన్ స్మారకార్థం ఘాట్ నిర్మిస్తామని తెలిపారు. గోరంట్ల, పుట్టపర్తిలో మురళీనాయక్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కళ్లి తండా పేరును మురళీ నాయక్ తండాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీరజవాన్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సవితకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa