ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం 8వ రోజు కొనసాగుతూనే ఉంది. దాడులు ఆపాలని ఇరాన్కు అమెరికా హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయితే ఆ హెచ్చరికలకు ఏ మాత్రం భయపడని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడుతూ.. ప్రతిదాడులు చేస్తూనే ఉన్నారు. ఇరాన్పై ఒత్తిడి పెరిగిపోతుండటంతో.. ఇప్పుడు ఆ దేశం బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధి ని మూసివేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుండటంతో.. ఒకవేళ ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై పూర్తిగా ఆధారపడిన భారత్, చైనా సహా అనేక దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
హర్మూజ్ జలసంధి అంటే ఏంటి?
అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గమే ఈ హర్మూజ్ జలసంధి. ఈ సన్నటి మార్గం కేవలం 33 కిలోమీటర్లు (21 మైళ్లు) వెడల్పు ఉంటుంది. ప్రపంచ దేశాలు నిత్యం వినియోగించే చమురులో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంది. కువైట్, బహ్రైన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలు చేసే చమురు ఎగుమతులు కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఇరాన్ సైనిక ఉనికి కూడా చాలా బలంగా ఉంది.
ఈ హర్మూ్జ్ జలసంధిని మూసివేయడం ద్వారా తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్కు ఉపయోగపడుతుందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ ప్రెసిడియం సభ్యుడు బెహ్నామ్ సయీది గురువారం మీడియాకు వెల్లడించడం గమనార్హం. తమపై పశ్చిమ దేశాలు చేస్తున్న ఒత్తిడికి ప్రతీకారంగా హార్మూజ్ జలసంధిని మూసేస్తామని గతంలో కూడా ఇరాన్ తీవ్ర బెదిరింపులకు దిగిన సంఘటనలు ఉన్నాయి.
భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం
హర్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు.. ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్, చైనా వంటి దేశాలకు ఇది తీవ్ర ప్రమాదంగా మారుతుందని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియా దేశాలకు వెళ్తున్నాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకే ఏకంగా 67 శాతం వెళ్తోంది. భారత ముడి చమురులో 90 శాతం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో 40 శాతం హర్మూజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్కు ఎంత కీలకమో అర్థం అవుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని మార్గాన్ని మూసేస్తే.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa