ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 07:36 PM

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో హామీ అమలుకు సిద్ధమైంది. రైతులకు హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి మూడు విడతల్లో రూ.6000 అందిస్తోంది. దీనికి జతగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.14000 అందించనుంది. ఆ రకంగా అర్హులైన రైతుకు ఏడాదికి రూ.20000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందించనున్నారు. అయితే జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తారనే వార్తలు వచ్చాయి.


అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన కింద ఒక విడతలో రూ.7000, మరో విడతలో రూ.7000, ఇంకో విడతలో రూ.6000 చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం రూ.7000 జూన్ 20న విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే ఈ కార్యక్రమం ఈ నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలిసింది. పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ యోజన 20వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలను కేంద్రం జూన్ 20న విడుదల చేయలేదు. జూన్ నెలాఖరులో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా జూన్ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు సమాచారం.


 మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీవ్యాప్తంగా మొత్తం 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. తొలి విడతగా జూన్ నెలలో రూ.7000, అక్టోబర్ నెలలో రెండో విడతలో రూ. 7 వేలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మూడవ విడతగా 2026 జనవరిలో రూ. 6 వేలు అందజేస్తారని సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 93 లక్షల మంది వరకూ రైతులు ఉన్నారు.. వీరిలో ప్రజాప్రతినిధులు, ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగించేవారిని అర్హుల జాబితా నుంచి తొలగించారు. అలాగే కుటుంబం యూనిట్‌గా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa