ఇటీవల అహ్మదాబాాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. కుప్పకూలి 272 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత పలు విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతుండటంతో.. విమాన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఇండిగో విమానంలో ఏర్పడిన పరిస్థితి.. తీవ్ర సంచలనంగా మారింది. గువాహటి నుంచి చెన్నైకి 168 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఇండిగో విమానం గురువారం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఈ ఇండిగో విమానంలో ఇంధనం తక్కువగా ఉండటంతో పైలట్లు మేడే కాల్ చేశారు. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడ రద్దీగా ఉండటం వల్ల విమానం సమయానికి ల్యాండ్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం 4:40 గంటలకు గువాహటి నుంచి ఇండిగో 6E-6764 (A321) విమానం బయలుదేరింది. రాత్రి 7:45 గంటలకు చెన్నై ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. కానీ రద్దీ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ ) నుంచి అనుమతి లభించలేదు. దీంతో విమానాన్ని కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే ఆ విమానంలో ఇంధనం అయిపోతుండటంతో పరిస్థితిని గమనించిన పైలట్లు వెంటనే మేడే కాల్ చేశారు. మేడే కాల్ అంటే విమానయానంలో అత్యవసర పరిస్థితి అని అర్థం. దీంతో వెంటనే స్పందించిన ఏటీసీ గ్రౌండ్ సిబ్బందిని అలర్ట్ చేసింది. రంగంలోకి దిగిన ఎయిర్పోర్ట్ సిబ్బంది వైద్య, అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. రాత్రి 8:20 గంటలకు విమానం బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ విషయాన్ని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ధృవీకరించారు.
ఇటీవల అహ్మదాబాద్లో ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం కూడా కూలిపోయే ముందు పైలట్లు మేడే కాల్ చేశారు. జూన్ 12వ తేదీన జరిగిన ఈ ఘటనలో విమానం నివాస భవనాలపై పడిపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులతోపాటు ఆ భవనంలో ఉన్న వారు సహా మొత్తం 272 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజా ఘటనలో ఇండిగో విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మరోవైపు.. శుక్రవారం చెన్నై నుంచి మధురైకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తిరిగి చెన్నైకి రప్పించారు. దాదాపు 68 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రమాదం తప్పింది. ఆ విమానంలోని ప్రయాణికులందరినీ క్షేమంగా దించినట్లు అధికారులు తెలిపారు. ఇలా కొన్నిరోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు విమాన ప్రయాణ భద్రతపై ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విమానయాన సంస్థలు భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa