ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను పూర్తిగా ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. గాజాలో పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమాన్ని కప్పిపుచ్చేందుకే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ దాడులతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపుతుందని భావించడంలేదని స్పష్టం చేశారు.హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఒవైసీ, అమెరికా చర్యలు కేవలం అంతర్జాతీయ చట్టాలు, ఐరాస చార్టర్ను మాత్రమే కాకుండా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మరియు అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏ దేశంపైనా యుద్ధం చేయరాదని ఆయన గుర్తుచేశారు.ఇజ్రాయెల్ అణ్వాయుధాల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఒవైసీ ప్రశ్నించారు. "700 నుంచి 800 అణు వార్హెడ్లు కలిగి, ఎన్పీటీపై సంతకం చేయని, ఐఏఈఏ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇన్స్పెక్టర్లను అనుమతించని ఇజ్రాయెల్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు" అని ఆయన అన్నారు. ఇరాన్ రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో 90 శాతం యురేనియం శుద్ధి చేస్తుందని, ఇరాన్ను ఎవరూ ఆపలేరని, ఆ దేశం ఎన్పీటీ నుంచి వైదొలుగుతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు.అమెరికా దాడుల నేపథ్యంలో, ఈ ప్రాంతంలోని అరబ్ మరియు ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని, బ్లాక్మెయిల్ను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంటాయని ఒవైసీ అభిప్రాయపడ్డారు. "మీరు వారిని ఆపలేరు" అని ఆయన అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని అమెరికా ఇంటెలిజెన్స్ స్వయంగా స్పష్టం చేసిందని, ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ కూడా చెప్పారని ఒవైసీ ఉటంకించారు.మధ్యప్రాచ్యంలో యుద్ధం వస్తే అక్కడ నివసిస్తున్న 60 లక్షల మంది భారతీయుల భద్రతపై ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో భారతీయ కంపెనీలకు పెట్టుబడులు ఉన్నాయని, అక్కడ పనిచేస్తున్న భారతీయ పౌరులు దేశానికి గణనీయమైన విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.ఇదే సమయంలో పాకిస్థాన్పై కూడా ఒవైసీ విరుచుకుపడ్డారు. మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోకి నెట్టినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. "దీనికోసమేనా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడితో కలిసి భోజనం చేసింది?" అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa