ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 07:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. కాలుష్య నివారణే ధ్యేయంగా, పర్యావరణ హితంగా ఉండేలా ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడపనుంది. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం ఈ-బస్‌ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు అందించనున్నారు. ఈ బస్సులను రాష్ట్రంలోని పలు నగరాలకు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోనూ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. విజయవాడలో నడుపుతున్న బస్సులు చాలావరకూ పాతవైపోయాయి. అలాగే విజయవాడలో కార్బన్ మోనాక్సై్డ్ పాళ్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల వాడకం మేలని అధికారులు భావిస్తున్నారు.


మరోవైపు విద్యాధరపుం ఆర్టీసీ డిపోకే 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నట్లు తెలిసింది. 15 రూట్లలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. కాళేశ్వరరావు మార్కెట్‌ - ఆటోనగర్, రైల్వేస్టేషన్‌ - ఆటోనగర్, హెచ్‌బీ కాలనీ - ఆటోనగర్, హెచ్‌బీ కాలనీ - పెనమలూరు, సిటీబస్‌ పోర్టు - మైలవరం, సిటీ బస్‌పోర్టు - విస్సన్నపేట, కాళేశ్వరరావు మార్కెట్‌ - పామర్రు, ఎన్‌ఎస్‌బీ నగర్‌ - ఆటోనగర్, పీఎన్‌బీఎస్‌ - విస్సన్నపేట, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ - ఆటోనగర్, కబేళా - గవర్నమెంట్‌ ప్రెస్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ - తాడిగడప రూట్ల మీదుగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పేర్లతో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు.


మరోవైపు ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్‌ కోసం విద్యాధరపురం డిపోలో 6000 కేవీ సామర్థ్యంతో ఛార్జింగ్‌ స్టేషన్‌ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 100 కి.మీలకు పైగా నడుస్తాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ఓ సంస్థకు అప్పగించారు. ఏపీఎస్ఆర్టీసీ కేవలం సిబ్బంది నియమించి.. నగదు లావాదేవీలను నిర్వహించనుంది.


మరోవైపు విజయవాడలో ప్రస్తుతం 400 వరకు సిటీ బస్సులు నడుస్తున్నాయి. బస్సుల నిర్వహణలో డీజిల్ వ్యయం ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే వాటి నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే నగరంలో కాలుష్యం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa