ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తమ తొలి ఏడాది పాలనపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అమరావతిలో కీలక సమావేశం జరగనుంది. పాలనాపరమైన అంశాలు, సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. 26 జిల్లాల నుంచి హాజరయ్యే అధికారులతో సమావేశం ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అందరితో కలిసి అక్కడే ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.వాస్తవానికి, కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు, రేపటి సమావేశంలో గత ఏడాది కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించుకోనుంది.ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధిపతులు , ప్రభుత్వ కార్యదర్శులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారు. తొలి ఏడాది సాధించిన ప్రగతిని వివరిస్తూ, రెండో ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రాబోయే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలనే అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లను అధిగమించి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణ పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు, 'వికసిత ఆంధ్రప్రదేశ్' సాధన కోసం 'స్వర్ణాంధ్ర @2047' వంటి దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa