ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎన్ఏ ద్వారా 251 మృతదేహాలు గుర్తింపు.. ఎందుకింత ఆలస్యం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 08:51 PM

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కాలి బూడిదైన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మొత్తంగా 274 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు 251 మంది మృతదేహాలను DNA పరీక్షల ద్వారా విజయవంతంగా గుర్తించారు. గుర్తించిన వారిలో 245 మృతదేహాలను ఇప్పటికే వారి బాధిత కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని మృతదేహాల గుర్తింపు అంతుచిక్కకుండా ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం చివరి చూపు చూసుకునే వీలైనా దొరకలేకపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


లండన్‌కు వెళ్లాల్సిన ఆ విమానం మధ్యాహ్నం 1:39 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే మెఘానినగర్‌లోని ఒక హాస్టల్ సముదాయంపై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో.. ప్రమాదంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, స్థానిక ప్రజలు సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విమాన శకలాలు పడి కొందరు, మంటల్లో కాలిపోయి మరికొందరు మృతదేహాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఎవరూ గుర్తించలేని విధంగా మారిపోయాయి. దీంతో మృతదేహాలను సాధారణ పద్ధతుల్లో గుర్తించడం అసాధ్యమైంది. అందుకే అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేస్తూ మృతదేహాలను గుర్తిస్తున్నారు.


అయితే మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించేటప్పుడు.. 72 గంటల్లోనే మృతదేహాలను అప్పగిస్తామని అన్నారు. కానీ ప్రమాదం జరిగి 13 రోజులు కావొస్తుండగా.. ఇంకా కొందరి మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఇదే విషయమైన అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 251 మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. వీరిలో 176 మంది భారతీయులు, 49 మంది బ్రిటన్ దేశస్తులు, ఏడుగురు పోర్చుగీసు వారు, ఒక కెనడియన్ మరియు 12 మంది ప్రయాణికులు కానివారు ఉన్నారని పేర్కొన్నారు.


మరణించిన వారిలో 70 మంది అహ్మదాబాద్ నుంచి, 24 మంది వడోదర నుంచి, 26 మంది ఆనంద్ నుంతి, 11 మంది ఖేడా నుండి ఉండగా.. మిగిలిన వారు రాజస్థాన్, మణిపూర్, నాగాలాండ్, మహారాష్ట్ర, బీహార్ మరియు డయ్యూ వంటి ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారని డాక్టర్ జోషి వివరించారు. DNA నమూనాలను సరిపోల్చే ప్రక్రియ ఎంతో సున్నితమైనదని.. దీనికి చట్టపరమైన నిబంధనలు కూడా ఉంటాయని డాక్టర్ జోషి అన్నారు. "అందుకే ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా మరియు వేగంగా పూర్తి చేస్తున్నాము. ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, ఇతర సంస్థలు, స్థానిక అధికారులు, ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర విభాగాలు, వివిధ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. మృతుల అవశేషాలను వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా అప్పగించడానికి కృషి చేస్తున్నాయి" అని ఆయన తెలిపారు.


శనివారం అధికారులు ఎనిమిది మంది బాధితుల కుటుంబాలను మళ్లీ సంప్రదించాల్సి వచ్చిందని, మొదట ఇచ్చిన DNA నమూనాలు సరిపోలకపోవడంతో ఇతర దగ్గరి బంధువుల నుండి కొత్త నమూనాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల వల్లే ఆలస్యం జరుగుతోందని కూడా డాక్టర్ రాకేష్ జోషి వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa