ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 09:47 PM

కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె ఆరోపించారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం, ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రశ్నించే ధైర్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని షర్మిల పేర్కొన్నారు. "రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ అసమర్ధత పాలనపై గొంతు ఎత్తే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది" అని ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనే సత్తా కూడా కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆమె వ్యాఖ్యానించారు.విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వంటి కీలక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతాయని షర్మిల అన్నారు. "విభజన హామీలు నెరవేరాలన్నా, రాజధాని కట్టాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది" అని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. పార్టీలో సహజంగా ఉండే చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సమస్యలపై అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa