లండన్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం పలువురు ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. విమానం గాల్లో ఉండగానే కొందరికి వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా దర్యాప్తు ప్రారంభించింది.లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 130లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది అనారోగ్యానికి గురైనట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వీరంతా వికారం, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. అంతకుముందు ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం 11 మంది అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఎయిర్ ఇండియా మాత్రం ఏడుగురు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని ప్రకటించింది.విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా వైద్య బృందాలు సిద్ధంగా ఉండి బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాయి. అస్వస్థత కొనసాగిన ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు క్యాబిన్ సిబ్బందిని తదుపరి పరీక్షల నిమిత్తం విమానాశ్రయంలోని వైద్య గదికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది.ఈ ఘటనకు కచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, ఈ విషయాన్ని నియంత్రణ సంస్థకు తెలియజేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా క్యాబిన్ ప్రెషర్ తగ్గడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని, అయితే అలాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు వాటంతట అవే కిందకు వస్తాయని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఈ విమానంలో అలా జరగలేదని, కాబట్టి ఫుడ్ పాయిజనింగే ప్రధాన కారణంగా ఉండొచ్చని ఆయన విశ్లేషించారు. కాగా, ప్రయాణికులకు ఆహారం వడ్డించిన తర్వాతే పైలట్లు భోజనం చేస్తారని, వారు ఎవరూ అస్వస్థతకు గురికాలేదని తెలిసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa