అమెరికాలో విద్య, వృత్తి విద్య లేదా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనాలని భావించే భారతీయ విద్యార్థులు, ఇతరులకు ఒక ముఖ్యమైన అప్డేట్. ఎఫ్, ఎం, జే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్లను 'పబ్లిక్'కు మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.అమెరికా వీసా దరఖాస్తుదారుల గుర్తింపు, అర్హతలను నిర్ధారించే భద్రతా తనిఖీ ప్రక్రియను సులభతరం చేయడమే ఈ కొత్త మార్పు ఉద్దేశమని అమెరికా ఎంబసీ తెలిపింది. "ఎఫ్, ఎం, లేదా జే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులందరూ తమ గుర్తింపును మరియు అమెరికా చట్టం ప్రకారం దేశంలోకి ప్రవేశానికి వారి అర్హతను నిర్ధారించడానికి అవసరమైన పరిశీలనను సులభతరం చేయడానికి వీలుగా తమ అన్ని సోషల్ మీడియా ఖాతాలలోని ప్రైవసీ సెట్టింగ్లను పబ్లిక్గా మార్చాలని అభ్యర్థించడమైనది" అని ఎంబసీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. సాధారణంగా ఎఫ్ వీసా అకడమిక్ విద్యార్థులకు, ఎం వీసా వృత్తి విద్యా కోర్సులు చేసేవారికి, జే వీసా పరిశోధకులు, స్కాలర్లు, ఇంటర్న్లతో సహా ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్లలో పాల్గొనేవారికి జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలో చదువుకోవాలనుకునే లేదా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లలో పాలుపంచుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు తమ వీసా దరఖాస్తులను సమర్పించడానికి ముందే వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్రజలకు కనిపించేలా చూసుకోవాలి.గతంలో వీసా దరఖాస్తు ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ను జాబితా చేయమని అమెరికా ప్రభుత్వం కోరినప్పటికీ, ఈ కొత్త చర్య మరింత ముందుకు వెళ్లింది. ఇప్పుడు దరఖాస్తుదారులు తమ ఆన్లైన్ కంటెంట్ను అధికారులు సులభంగా వీక్షించేందుకు వీలుగా ప్రైవసీ పరిమితులను తొలగించాలని కోరుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa