రాజస్థాన్లోని దీగ్ జిల్లా బహాజ్ గ్రామంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో ఓ అద్భుత ఆవిష్కరణ వెలుగుచూసింది. భూమికి 23 మీటర్ల లోతున ఒక ప్రాచీన నదీ ప్రవాహ మార్గం (పాలియోఛానల్) బయటపడింది. ఇది వేదాల్లో ప్రస్తావించిన సరస్వతీ నది జాడలు కావచ్చని, భారత పురావస్తు చరిత్రలోనే ఇది అపూర్వమైన ఆవిష్కరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఈ ఏడాది మే వరకు సాగిన ఈ తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 3500 నుంచి 1000 మధ్య కాలంలో ఇక్కడ నాగరికత విలసిల్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. "ఈ ప్రాచీన నదీ వ్యవస్థ ఆనాటి మానవ ఆవాసాలకు జీవనాధారంగా నిలిచి, బహాజ్ గ్రామాన్ని విస్తృతమైన సరస్వతీ నదీ పరీవాహక సంస్కృతితో కలుపుతుంది" అని ఏఎస్ఐ జైపూర్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ వినయ్ గుప్తా తెలిపారు. కుషానులు, మగధ, శుంగ వంశాల కాలంనాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి.తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు, పొరలుపొరలుగా ఉన్న గోడల కందకాలు, కొలిమిలు, వివిధ ఇనుప, రాగి వస్తువులు బయల్పడ్డాయి. సూక్ష్మశిలా పరికరాలు హోలోసీన్ పూర్వ కాలం నుంచే ఇక్కడ మానవ ఉనికిని సూచిస్తున్నాయి. క్రీ.పూ. 1000 నాటి 15 యజ్ఞకుండాలు, శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు, శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa