ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది అణు బాంబుల తయారీకి సరిపడే 400 కిలోల ఇరాన్ యురేనియం మిస్సింగ్

international |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 08:50 PM

ఇజ్రాయెల్‌కు మద్దతుగా జూన్ 22న ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన ‘బంకర్ బస్టర్’ దాడుల తర్వాత సుమారు 400 కిలోల శుద్దిచేసిన యురేనియం కనిపించకుండా పోయిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఈ యురేనియంతో 10 అణు బాంబులను తయారుచేసే అవకాశం ఉందని ఆయన ఏబీసీతో మాట్లాడుతూ చెప్పారు. ఈ యురేనియం 60% శుద్ధి చేసిందిగా భావిస్తున్నారు. అణ్వాయుధంగా మారేందుకు ఇది 90% స్థాయికి చేరాలి. అయినప్పటికీ, ఇంత మోతాదులో యురేనియం కనిపించకుండా పోవడం యుద్ధంపై పలు సందేహాలు లేపుతోంది.


ఉపగ్రహ ఫోటోల్లో అనుమానాస్పద కదలికలు!


దాడులకు ముందు ఫోర్దో అణు కేంద్రం వద్ద 16 ట్రక్కులు వరుసగా నిలబడి ఉండగా, దాడుల తర్వాత ఆ ట్రక్కులే కనిపించకుండా పోయినట్లు ఉపగ్రహ ఫోటోలు వెల్లడించాయి. ఈ కేంద్రం పర్వతాల లోపల ఉండటంతో సాధారణ క్షిపణుల దాడులకు అందని స్థితిలో ఉంది. అందువల్లే అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో బంకర్ బస్టర్లును ప్రయోగించింది. అమెరికా సైన్యం ఆదివారం తెల్లవారుజామున (జూన్ 22న) ఫోర్దో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు నిర్వహించింది. దాడుల అనంతరం తీవ్ర విధ్వంసం కనిపించినా, ట్రక్కులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, దాడికి ముందే ఫోర్డో అణు కేంద్రం నుంచి యురేనియం నిల్వలను రహస్య ప్రాంతానికి తరలించామని ఇరాన్ అంటోంది. మరి ఇందులో నిజమెంతో? మరి తెలియాల్సి ఉంది.


IAEA హెచ్చరిక


అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘యురేనియం భద్రంగా ఉందా? లేదా? అని నిర్ధారించేందుకు మళ్లీ తనిఖీలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది’ అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో తెలిపారు. కాగా, ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే అని చెప్పుకుంటున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం ఆరోపణలు చేస్తోంది. ఇరాన్ ‘వెనుదిరగని దశకు చేరుకుంది’ అని తేలావివ్ వర్గాలు పేర్కొన్నాయి.


ఇరాన్‌పై వందల కొద్దీ ఫైటర్ జెట్లతో ఇజ్రాయేల్ దాడి.. ఆర్మీ చీఫ్ సహా పలువురు హతం


అమెరికా వాదనలో గందరగోళం


ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం ఇరాన్ అణ్వాయుధాల తయారు చేయడం లేదని తెలిపింది. కానీ, అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తాజాగా ‘"ఇరాన్ వారం రోజుల్లోనే అణు ఆయుధాలు తయారు చేయగలదు’ అని చెప్పడం గమనార్హం. ఇదే విషయంపై ట్రంప్ మండిపడి, గత ప్రకటన తప్పు అని ప్రకటించారు.


 ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘విజయవంతమైన 37 గంటల సైనిక ఆపరేషన్‘గా ప్రకటించారు. మిసౌరీలోని ఎయిర్ బేస్ నుంచి బి-2 స్పిరిట్ బాంబర్లు నిశ్శబ్దంగా ప్రయాణించి ఈ బంకర్ బస్టర్లను వేసినట్లు చెప్పారు. ఇరాన్ రాడార్లను ఏమార్చడానికి టోమాహాక్ మిసైళ్లనను కూడా ఉపయోగించినట్టు ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa