ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీకి షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు.. విపక్ష వైసీపీ లో చేరిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్ని రోజులుగా టీడీపీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్న సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన సుగవాసి బాలసుబ్రమణ్యం కుటుంబం సుమారు 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తోంది. టీడీపీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం.
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం 1995లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాయచోటి జడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గానూ పనిచేశారు. 2012లో రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికలప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. తనకు తగినంత ప్రాధాన్యం లభించలేదని గత కొంతకాలంగా సుగవాసి బాలసుబ్రమణ్యం అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కడపలో టీడీపీ మహానాడు జరిగిన పది రోజుల తర్వాత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్లు అధినేత చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖ పంపారు.
రాజంపేట నియోజకవర్గం టీడీపీలో విభేదాల వలనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది.రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యం మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సుగవాసి సుబ్రమణ్యం టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు తెలిసింది. మరోవైపు సుగవాసి బాలసుబ్రమణ్యం తండ్రి.. సుగవాసి పాలకొండ్రాయడు చనిపోయినప్పుడు.. పార్టీ తరుఫున ఎవరూ రాలేదనే ఆవేదనతోనూ ఆయన ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa