ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 06:08 PM

సామాజిక మాధ్యమాల్లో రీల్స్ మోజు యువత ప్రాణాల మీదకు తెస్తోందనడానికి ఓ విషాద సంఘటన మరో నిదర్శనంగా నిలుస్తోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్తు నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతి చెందింది. రీల్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఆమె నగరంలోని ఒక షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రాత్రి కొందరు స్నేహితులతో కలిసి ఆమె ఆ నిర్మాణంలో ఉన్న భవనానికి లేట్ నైట్ పార్టీ కోసం వెళ్లింది. పార్టీ అనంతరం, వారి మధ్య ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించి గొడవ జరిగినట్లు సమాచారం.ఈ వాగ్వాదం తర్వాత, ఆ యువతి తీవ్ర మనస్తాపంతో పై అంతస్తుకు వెళ్లిందని, అక్కడ విచారకరమైన రీల్ చిత్రీకరించే ప్రయత్నంలో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ లిఫ్ట్ షాఫ్ట్ కోసం వదిలిన ఖాళీ ప్రదేశం నుంచి కిందపడిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ ఘటనపై సౌత్ ఈస్ట్ డీసీపీ ఫాతిమా స్పందిస్తూ, "వారు ఆ భవనంలో పార్టీ చేసుకున్నారు. తర్వాత రీల్స్ చిత్రీకరించడానికి పై అంతస్తుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె జారిపడి మరణించింది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు దారితీసిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అనుమానాస్పద మృతి  కింద కేసు నమోదు చేశాం" అని తెలిపారు. పరప్పన అగ్రహార పోలీసులు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ జరుపుతున్నారు. యువతి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa