వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో గురువారం జూన్ 26 అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్డీఎంఏ తెలియజేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ అల్పపీడన ప్రభావం సుమారు నాలుగు రోజుల పాటు ఉంటుందని, ఈ సమయంలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా కురవవచ్చని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. అంతేకాకుండా, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తత వహించాలని అధికారులు కోరారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa