భారత్-చైనా మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించి, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా నాలుగు సూత్రాలతో కూడిన ఒక ప్రత్యేక ఫార్ములాను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు ప్రతిపాదించారు. చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా ఆయన చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా రాజ్నాథ్ ఈ ప్రణాళికను చైనా ముందుంచారు.రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించిన నాలుగు అంశాల ప్రణాళికలో సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే కీలకమైన అంశాలు ఉన్నాయి. 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రెండోదిగా, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పూర్తిగా చల్లార్చేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు. మూడో అంశంగా, సరిహద్దుల మార్కింగ్, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వివాదాలకు శాశ్వత ముగింపు పలకాలని ప్రతిపాదించారు. చివరగా, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి, సంబంధాలను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కొత్త ప్రక్రియలను రూపొందించాలని తెలిపారు.ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ కేవలం చైనా సరిహద్దు అంశాలకే పరిమితం కాలేదు. పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదం అంశాన్ని కూడా ఆయన చైనా రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో భారత్ ఎంతమాత్రం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సిందూర్’ అనేది ఇప్పుడు భారత్ స్పష్టమైన, సైద్ధాంతిక వైఖరి అని ఆయన నొక్కిచెప్పినట్లు సమాచారం. ఈ చర్చల ద్వారా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడంతో పాటు, వ్యూహాత్మక అంశాలపై కూడా భారత్ తన దృఢమైన వైఖరిని చైనాకు స్పష్టం చేసినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa