ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతాలో లా విద్యార్థినిపై కశాశాలలోనే గ్యాంగ్ రేప్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:18 PM

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మరో దారుణం జరిగింది. గతేడాది ఇదే రాష్ట్రంలో ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ప్రజలింకా మర్చిపోక ముందే మళ్లీ అలాంటి ఘటనే సంభవించింది. ముఖ్యంగా లా కాలేజీలోనే ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా మిగతా ఇద్దరు ప్రస్తుత విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితురాలు కస్బాలోని లా కాలేజీలో చదువుతోంది. అయితే జూన్ 25 రాత్రి 7.30 గంటలకు ఆమె కళాశాల ప్రాంగణంలో ఉండగా.. నిందితులు వచ్చి ఆమెను బలవంతంగా సెక్యూరిటీ గదిలోకి తీసుకెళ్లారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు రాక్షస క్రీడ జరిపారు. ఆపై ఆమెను అక్కడే వదిలేసి.. వారంతా పారిపోయారు. 10.50 గంటలకు మెల్కువ వచ్చిన విద్యార్థిని అక్కడి నుంచి తప్పించుకుంది. నేరుగా ఆరోజు హాస్టల్‌కు చేరుకుంది. మరుసటి రోజే ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమంలోనే బాధితురాలిని కోల్‌కతా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.


ఆపై అనేక మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచి.. ఫొరెన్సిక్ పరీక్ష కోసం భద్రపరిచారు. అయితే విద్యార్థిని ఫిర్యాదు చేసిన రోజే పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యంగా 26వ తేదీ రోజు తల్బాగన్ క్రాసింగ్ వద్ద సిద్దార్థ్ శంకర్ శిశు రాయ్ ఉద్యాన్ సమీపంలో 7.20 నుంచి 7.35 గంటల ముధ్య మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్‌లను పట్టుకున్నారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.


ఈ మరుసటి రోజు ఉదయమే ప్రమిత్ ముఖర్జీని ఆయన ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. అయితే నిందితులు 31 ఏళ్ల మనోజిత్ మిశ్రా (పూర్వ విద్యార్థి), 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ (ప్రస్తుత విద్యార్థులు)లుగా గుర్తించారు. అలాగే నిందితులు ముగ్గురినీ అలీపూర్ కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం వారిని పోలీసు కస్టడీకి పంపింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సీల్ చేసి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. బీజేపీ నాయకులు రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.


గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలను గుర్తుచేస్తూ.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని, నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఈ ఘటన కోల్‌కతాలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీసులు ఈ కేసును త్వరగా పూర్తి చేసి బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa