ఐపీఎల్ 2025తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన హవా కొనసాగిస్తున్నాడు. తన మెరుపు బ్యాటింగ్తో రికార్డులు సృష్టిస్తున్న ఈ లెఫ్డ్ హ్యాండర్ ఇంగ్లాండ్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేస్తున్నాడు. ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ అండర్ 19 టీమ్, భారత్ అండర్ 19 టీమ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో పెను విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అతడు.. భారత్-ఏ తరఫున 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్ - 19 టీమ్.. భారత బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు బ్యాటింగ్ కూడా చేయలేకపోయింది. 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కనిష్క్ చౌహాన్ 3, మొహమ్మద్ ఎనాన్ రెండు వికెట్లు పడగొట్టారు. పేసర్లు ఆర్ఎస్ అంబరీష్, హెనిన్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లాండ్ జట్టులో ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడు 90 బంతుల్లో 56 రన్స్ చేశాడు.
అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి.. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మాత్రే నిదానంగా బ్యాటింగ్ చేసినా.. వైభవ్ మాత్రం టీ20 తరహాలో రెచ్చిపోయాడు. వైభవ్ దెబ్బకు భారత్ 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వైభవ్ 19 బంతుల్లో 48 పరుగులు చేశాడు. భారీ షాట్కు ప్రయత్నించి హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు.
మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో భారత్.. కేవలం 23.6 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత అండర్ 19 టీమ్ ఈ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుతో 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. కాగా 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ‘వైభవ్ సూర్యవంశీ’.. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ కొట్టడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa