విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో అత్యంత కిరాతకంగా ఆరుగురిని హత్య చేసిన ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ విశాఖపట్నం నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు శుక్రవారం తీర్పు చెచ్చారు. నాలుగేళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో 91 మంది సాక్షులను విచారించిన అనంతరం, నిందితుడిపై నేరం రుజువు కావడంతో తీర్పు వెలువరించారు. కేసు గురించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడలో 2021 ఏప్రిల్ 15న బత్తిన అప్పలరాజు (49) అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్కుమార్ కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో విజయ్కుమార్ భార్య ఉషారాణి (35), కుమార్తె ఊర్విష లిఖిత (ఆరు నెలలు), కుమారుడు ఉదయ్నందన్ (2), తండ్రి బమ్మిడి రమణ (63), మేనత్త నెక్కల అరుణ (57), అత్త రమాదేవి (62) ఉన్నారు. అనంతరం అప్పలరాజు డయల్ 100కు ఫోన్ చేసి, పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్ళితే.... కొన్నేళ్ల క్రితం అప్పలరాజు ఇంటి సమీపంలోనే విజయ్కుమార్ కుటుంబం నివాసం ఉండేది. ఆ సమయంలో అప్పలరాజు కుమార్తె పట్ల విజయ్కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. తర్వాత ఉపాధి రీత్యా విజయ్కుమార్ కుటుంబం విజయవాడ వెళ్లిపోయింది. ఒకరోజు విజయ్కుమార్ మినహా మిగిలిన కుటుంబసభ్యులు స్వగ్రామం జుత్తాడ వచ్చారు. అప్పటికే పగతో రగలిపోతున్న అప్పలరాజుకు ఈ విషయం తెలియడంతో 2021 ఏప్రిల్ 15వ తేదీ తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపు జల్లుతున్న విజయ్కుమార్ భార్యపై కత్తితో దాడి చేశాడు.అనంతరం ఇంట్లోకి ప్రవేశించి, నిద్రిస్తున్న విజయకుమార్ తండ్రి, అత్త, మేనత్తలను నరికేశాడు. ఉలిక్కిపడి లేచి ఏడుస్తున్న ఆరునెలల పసిపాప, రెండేళ్ల బాబును కూడా చంపేశాడు. అనంతరం బయటికి వచ్చి స్థానికులను కత్తితో బెదిరించి పోలీసులకు తానే ఫోన్ చేసి లొంగిపోయాడు. విచారణలో ముద్దాయి అప్పలరాజులో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అప్పటి సీఐ అశోక్కుమార్ తెలిపారు. నాలుగేళ్ల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి అప్పలరాజుకు న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa