ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని, అన్నదాత దుఃఖిభవ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్యాయం జరుగుతోందని వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని షర్మిల తెలిపారు.
కాకినాడ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల., రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉంటే, అర్హత పేరుతో అన్నదాత సుఖీభవ పథకానికి సగానికి సగం మందికి కోత పెట్టారని అన్నారు. కేవలం 47 లక్షల మందికే పథకం వర్తింపజేస్తారని, ఇది 43 లక్షల మంది రైతులకు చేస్తున్న అన్యాయమని షర్మిల ఆరోపించారు. "అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖిభవ చేస్తున్నారు" అని విమర్శించారు. వడపోత పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
సూపర్ సిక్స్ పథకాలకు కోత పెడుతున్నారంటూ వైెఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చే ముందు కోతలు విధిస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకంలో కూడా కోతలు విధించారని అన్నారు. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 67 లక్షల మందికే లబ్ధి చేకూర్చారని, 20 లక్షల మందికి మోసం చేశారని ఆరోపించారు. మహాశక్తి పథకాన్ని కూడా మోసం చేశారని.. ఎన్నికల ముందు రూ.1500 P4 కింద లింక్ పెడతామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాలేదని వైఎస్గ్ షర్మిల గుర్తు చేశారు.
మరోవైపు ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదని షర్మిల అన్నారు. జగన్ తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తారని విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేసే ఉద్యమాల జోలికి జగన్ వెళ్లరని, బీజేపీని జగన్ ఏమీ అనరని ఆమె అన్నారు. కాంగ్రెస్ ఒక మహా సముద్రం లాంటిదన్న వైఎస్ షర్మిల.. పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్లో సీనియర్లు ఎవరూ నిరుత్సాహంగా లేరని, ఎటువంటి వర్గ పోరు లేదని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకొని పనిచేస్తున్నామని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని షర్మిల అన్నారు.
రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని షర్మిల ఆరోపించారు. విభజన హామీలను విస్మరిస్తోందని, పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం చేశారని ఆమె అన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి వినాశనం చేస్తున్నారని, 45 మీటర్ల ఎత్తులో కడితేనే ప్రయోజనం ఉంటుందని, 41 మీటర్ల ఎత్తులో కడితే అది ప్రాజెక్టు కాదని, బ్యారేజ్ మాత్రమేనని ఆమె అన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. బీజేపీకి బాబు, పవన్, జగన్ గులాంగిరి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజధానికి నిధులు కేంద్రం ఇవ్వాలని, కానీ అప్పులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని షర్మిల అన్నారు. కాంగ్రెస్తోనే విభజన హామీలు సాధ్యమని, పోలవరం పూర్తి చేయాలంటే, రాజధాని కట్టాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa