రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన శుభవార్త అందించింది. ఇకపై రైలు బయల్దేరడానికి 8 గంటల ముందే తుది రిజర్వేషన్ చార్ట్ను సిద్ధం చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం ఈ చార్ట్ను రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయంతో ప్రయాణికులకు, ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారికి ఊరట లభించనుంది.టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపడుతున్న సంస్కరణల పురోగతిని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టికెటింగ్ ప్రక్రియ మొత్తం స్మార్ట్గా, పారదర్శకంగా ఉండాలని, ప్రయాణికుల సౌకర్యానికే పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష అనంతరం, రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పును ఎలాంటి అంతరాయాలు లేకుండా దశలవారీగా అమలు చేయనున్నారు.ఇకపై రిజర్వేషన్ చార్ట్ను రైలు బయల్దేరడానికి 8 గంటల ముందే సిద్ధం చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు తమ టికెట్ స్టేటస్ను ముందుగానే చూసుకునేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చేవారికి ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వారికి తగినంత సమయం దొరుకుతుంది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికుల అనిశ్చితికి తెరదించుతూ, వారి ప్రయాణ ప్రణాళికలను మరింత సులభతరం చేయడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.దీంతో పాటు, భారతీయ రైల్వే తన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)ను భారీగా అప్గ్రేడ్ చేసే పనిలో ఉంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త వ్యవస్థ, ప్రస్తుత వ్యవస్థ కంటే పది రెట్లు అధిక లోడ్ను నిర్వహించగలదు. 2025 డిసెంబర్ నాటికి ఈ అప్గ్రేడ్ పూర్తి కావచ్చని అంచనా. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే, నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే, నిమిషానికి 40 లక్షల కంటే ఎక్కువ టికెట్ ఎంక్వైరీలను ఇది నిర్వహించగలదు.కొత్త పీఆర్ఎస్ వ్యవస్థలో ప్రయాణికుల సౌలభ్యం కోసం బహుభాషా సపోర్ట్, సులభమైన ఇంటర్ఫేస్, ఛార్జీల క్యాలెండర్, సీట్ల ఎంపికలో ప్రాధాన్యత వంటి అధునాతన ఫీచర్లను కూడా తీసుకురానున్నారు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులకు అవసరమైన సపోర్ట్ను కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయనున్నారు. మరోవైపు, జూలై 1 నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ధృవీకరించిన యూజర్లు మాత్రమే అనుమతించబడతారు. జూలై నెలాఖరు నాటికి, తత్కాల్ బుకింగ్ల కోసం ఆధార్ లేదా డిజిలాకర్తో అనుసంధానమైన ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల ద్వారా ఓటీపీ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa