ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం, కుర్చీ కోసం కుంపట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 06:38 PM

కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ ను కూర్చోబెట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు సీఎం మార్పును కోరుకుంటున్నారని, డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది.పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇక్బాల్ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్బాల్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, "పార్టీ బలోపేతానికి డీకే శివకుమార్ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయనకు సీఎం అయ్యే అర్హత ఉంది. వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నాయకత్వ మార్పు జరగకపోతే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కష్టం" అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సుర్జేవాలా దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.అయితే, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. మైసూరులో డీకే శివకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు 'బండ'లా పటిష్ఠంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్యను ఆయన మద్దతుదారులు 'బండ' అని పిలుచుకుంటారు. శివకుమార్‌తో తన సంబంధాలు సజావుగా ఉన్నాయని చెప్పడానికి ఆయన చేయి పట్టుకుని ఐక్యతను ప్రదర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa