ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా లా స్టూడెంట్ అత్యాచారం కేసు,,,ఇన్‌హేలర్ ఇచ్చి మరీ దారుణానికి ఒడిగట్టారు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 10:02 PM

కోల్‌కతా లా స్టూడెంట్ అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాలేజీ ప్రాంగణంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ముందస్తు ప్లాన్ ప్రకారమే బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. బాధితురాలు కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే నిందితులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారని.. అవకాశం కోసం చూస్తూ.. తాజాగా దారుణానికి ఒడిగట్టారని తెలిసింది. ఇక ఈ ఘటనలో మరింత దారుణమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..


నిందితుల దాడి వల్ల బాధితురాలు స్పృహ తప్పింది. దీంతో నిందితులు ఇన్‌హేలర్ తెప్పించారు. ఆమె కాస్త తేరుకున్నాక.. నిందితులు మరింత దారుణంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కానీ నిందితుల తరఫు న్యాయవాది.. తన క్లయింట్ మానవతా హృదయంతో బాధితురాలి కోసం ఇన్‌హేలర్ తెప్పించారని కోర్టుకు తెలిపారు.


కానీ పోలీసులు విచారణలో నిందితులు తమ రాక్షస క్రీడ గురించి బాధితురాలికి తెలియాలనే ఉద్దేశంతోనే.. ఆమె స్పృహలో ఉండగానే అత్యాచారం చేయాలని భావించే ఇన్‌హేలర్ తెప్పించినట్లుగా వెల్లడైంది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. దీంతో కోల్‌కతా కోర్టు.. నిందితుల పోలీసు కస్టడీని జులై 8 వరకు పొడిగించింది.


ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రాకు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంతో సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. అతడితో పాటుగా అదే కాలేజికి చెందిన మరో ఇద్దరు ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్‌తో పాటుగా మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


నిందితుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. బాధితురాలికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నందున మానవతా కారణాల వల్ల ఇన్‌హేలర్ కొన్నాడని కోర్టుకు తెలిపారు. అంతేకాక నిందితులలో ఒకరు సమీపంలోని మెడికల్ స్టోర్ నుండి ఇన్హేలర్ కొనడానికి కళాశాల ప్రాంగణం నుండి బయటకు వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. కానీ వారు ఇన్‌హేలర్ కొన్నది మానవత్వంతో కాదు.. మరింత దారుణంగా హింసిచడం కోసమే అని తెలిసింది.


ఈ దారుణం గురించి బాధితురాలు మాట్లాడుతూ.. ‘నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లమని వారిని వేడుకున్నాను.. కానీ వారు నాకు సాయం చేయలేదు. నేను తప్పించుకుని పారిపోవాలని చూశాను. కానీ మెయిన్ గేట్‌కు తాళం వేసి ఉంది. గార్డు కూడా నాకు సాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. నాకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి స్పృహ తప్పాను. దీంతో మనోజిత్ మిశ్రా.. ఇన్‌హేలర్ తీసుకురావాల్సిందిగా తనతో ఉన్న వారికి చెప్పాడు. దాన్ని వాడాక నాకు కాస్త ఉపశమనం లభించింది. దీంతో నేను అక్కడ నుంచి తప్పించుకోవడానకి ప్రయత్నం చేశాను. కానీ వారు నన్ను గార్డ్ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని’ పేర్కొంది. అయితే మనోజిత్ మాత్రం తాము అత్యాచారం చేయలేదని.. ఏకాభిప్రాయంతోనే జరిగిందని వాదించాడు. కానీ వైద్య పరీక్షలో మనోజిత్ శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించిన వైద్యులు.. ఇవి ప్రతిఘటించే సమయంలో అయిన గాయాలుగా నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa