ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశ్చిమాసియా నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి... మారుతున్న ఐఎస్ఐ వ్యూహాలు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 07:03 PM

ఇప్పటి వరకూ గూఢచర్యం విషయంలో సరిహద్దుల్లోకి చొరబడే వ్యక్తులను వినియోగించిన పాకిస్థాన్ తన వ్యూహం మార్చింది. ఈ ఏడాది ఆరంభంలో నేపాలీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) నెట్‌వర్క్ వెనుకున్న కుట్ర బహిర్గతమైంది. ఐఎస్ఐ ఆధ్వర్యంలో నడిచే ఈ నెట్‌వర్క్‌... సంప్రదాయేతర మార్గాలు, వ్యక్తులను వినియోగిస్తూ భారత సైనిక సమాచారాన్ని సేకరిస్తోంది. నేపాల్‌లోని రౌటహాట్ జిల్లాకు చెందిన అన్సారుల్ మియా అన్సారిని ఫిబ్రవరి 14 రాత్రి ఢిల్లీలో అరెస్టయ్యాయి. విశ్వాస్‌నగర్ వద్ద ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అదుపులోకి తీసుకోగా.. ఈ అరెస్ట్‌‌ ఐఎస్ఐ గూఢచార చర్యపై కీలక ఆధారాలు వెలుగులోకి తీసుకొచ్చింది.


ఫిబ్రవరి 14 రాత్రి 10 గంటల సమయంలో అన్సారీ ఓ ప్యాకేజ్‌ను డెలివరీ చేయబోతున్న సమయంలో పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి ల్యాప్‌టాప్, ప్రింటర్, భారత సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలు, ఆర్మీ ట్రెయినింగ్‌ కరదీపిక ‘‘ఫైటింగ్ ఇన్ బిల్టప్ ఏరియాస్-1982’లో ‘సీక్రెట్’, ‘కాన్ఫిడెన్షియల్‌’ అని మార్క్‌ చేసిన మాన్యువల్స్ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సున్నితమైన అంశం కలిగిన ఓ సీడీ కూడా గుర్తించారు. అందులో భద్రతా సంబంధిత సమాచారం ఉన్నట్లు అనుమానం. అరెస్టు సమయంలో సీడీని ధ్వంసంచేసి, టాయిలెట్‌లో వదిలేశాడని పోలీసులు భావిస్తున్నారు.


ప్రాథమిక విచారణలో అన్సారీ 2008 నుంచి ISI కోసం పనిచేస్తున్నట్లు అంగీకరించాడు. వాట్సాప్‌లో ‘యాసిర్’ అనే పేరుతో ఉన్న పాకిస్థానీ హ్యాండ్లర్‌‌కు మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ పంపుతూ సంప్రదింపులు జరిపినట్టు తేలింది. అన్సారి తప్పుడు లేదా ద్వంద్వ గుర్తింపు పత్రాలతో నేపాల్ నుంచి భారత్‌లోకి మధ్యవర్తుల సహకారంతో భద్రతా సమాచారం సేకరించి, వాటిని హార్డ్ కాపీలు లేదా డిజిటల్ ఫార్మాట్‌లో పంపించేవాడని విచారణలో వెల్లడైంది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కుట్రలు బహిర్గతమైన విషయం తెలిసిందే.


ఈ నెట్‌వర్క్‌లో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ‘పింటూ’ అనే వ్యక్తి ISBT వద్ద సున్నితమైన సమాచారం ఉన్న సీడీని అన్సారికి ఇచ్చినట్లు గుర్తించారు. అరెస్టు భయంతో సీడీని తానే ధ్వంసం చేసేశానని అన్సారీ వెల్లడించాడు. ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన అఖ్లాక్ అజామ్ అనే మరో వ్యక్తిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు అన్సారీ భారత్‌లో ఉన్న సమయంలో ఆశ్రయం, లాజిస్టికల్ సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


అన్సారీ మొబైల్ ఫోన్‌ నుంచి పాకిస్థాన్ నంబర్లతో వాట్సాప్ చాట్లు.. పశ్చిమ ఆసియా, నేపాల్, ఉత్తర భారత్‌తో ఉన్న కాల్ రికార్డులు, సైనిక మోహరింపు డేటా, వ్యూహాత్మక మ్యాపింగ్ వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాచారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటలిజెన్స్ కి అప్పగించారు. లీక్ అయిన ఖచ్చితమైన సమాచారాన్ని అధికార వర్గాలు బయటపెట్టలేదు కానీ, కొన్ని పత్రాలు సైనిక త‌ర‌లింపులు, అర్బన్ వార్ స్ట్రాటజీకి సంబంధించినవేనని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశంలోని పలువురు ఐఎస్ఐ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.


ఐఎస్ఐ వ్యూహం మార్పు


ఇప్పటి వరకు సరిహద్దుల్లోకి చొరబడే గూఢచారులతో పనిచేసిన ISI... ఇప్పుడు నేపాల్, పశ్చిమాసియాకు చెందిన పౌరులను నియమిస్తూ అనుమానం రాకుండా సరిహద్దులను దాటిచ్చే వ్యూహానికి మారిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.


అన్సారీ ఒక్కడే కాదు.. గత కొన్నివారాల్లో దేశవ్యాప్తంగా సుమారు 15 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరంతా సైనిక. పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థానీ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లలో చోటుచేసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa