ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పన్న ఆలయంలో కూలిన రేకుల షెడ్డు.. భక్తులకు తప్పిన ముప్పు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 08:02 PM

సింహాచలం అప్పన్న ఆలయంలో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అప్పన్న ఆలయంలోని తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు ఉన్నట్లుండి కూలిపోయింది. బరువు ఎక్కువై రేకుల షెడ్డు కూలినట్లు తెలిసింది. అయితే అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో రేకుల షెడ్డు కింద భక్తులు లేకపోవటంతో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవలే సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొన్న గోడ, ఇవాళ షెడ్డు కూలటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నారు.


మరోవైపు ఏప్రిల్ నెలలో సింహాచలం అప్పన్న ఆలయంలో చందనోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. చందనోత్సవం సమయంలో ఆలయంలో గోడ కూలి ఏడుమంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సింహాచలం ఆలయంలో గోడకూలిన ఘటనపై సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించిన ఏపీ ప్రభుత్వం.. ఆరుగురు ఇంజినీర్లపై వేటు వేసింది. ఇద్దరు ఇంజినీర్ల మీద క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. అలాగే సింహాచలం ఆలయ ఈవోను సస్పెండ్‌ చేశారు. గోడ కట్టించిన కాంట్రాక్టర్ మీద క్రిమినల్‌ చర్యలకు ఆదేశించారు. అలాగే బ్లాక్‌లిస్ట్‌లో ఉంచారు.


మరోవైపు సింహాచలం గోడ కూలిన ఘటనపై కమిటీ.. ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్‌, డ్రాయింగ్, ప్లాన్‌ రూపొందించలేదని పేర్కొంది. అలాగే అధిక బరువును తట్టుకునేలా నిర్మించలేదని స్పష్టం చేసింది. పునాది లేకుండానే గోడ కట్టారని తెలిపింది. నాణ్యత లేని సిమెంట్, ఇటుకలు వాడారని.. గోడకు సరిగా క్యూరింగ్‌ చేయలేదని పేర్కొంది. వర్షపు నీటి ప్రవాహానికి ఈ గోడ అడ్డుగా నిలిచిందని తెలిపింది. ఈ గోడ నిర్మాణంలో ఇంజనీర్లు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంది. ఆరుగురు ఇంజినీర్లపై వేటు వేసింది. అయితే సింహాచలంలో గోడ కూలిన ఘటన మరువక ముందే మరో రెండు నెలల వ్యవధిలోనే ఇలా రేకులషెడ్డు కూలటంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa